నోట్ల రద్దు తర్వాత.. నిద్రలేని రాత్రులు గడిపా!: చంద్రబాబు
నోట్ల రద్దు తర్వాత తాను నిద్రలేని రాత్రులు గడిపానని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు పేర్కొనడం గమనార్హం.
విజయవాడ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో.. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సాహించాలన్న ఉద్దేశ్యంతో బుధవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు తర్వాత తాను నిద్రలేని రాత్రులు గడిపానని చంద్రబాబు పేర్కొనడం గమనార్హం. నోట్ల రద్దు జరిగి 40రోజులు కావస్తున్నా.. నేటికి సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభిప్రాయపడ్డారు.
సాంకేతికతను సద్వినియోగం చేసుకుని నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు వారికి సూచించారు. ప్రస్తుతం ఏపీలోని చౌక ధరల దుకాణాల్లో అమలు చేస్తున్న ఇ-పోస్ విధానం అత్యుత్తమమైనదని దేశమంతా కొనియాడుతోందని చంద్రబాబు తెలిపారు.
పెన్ కొన్నాను.. డబ్బులు కట్ అవలేదు.. ఎందుకలా?
రెండో రోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా ఓ ఐఏఎస్ అధికారిణి నగదు రహిత లావాదేవీలపై సీఎం చంద్రబాబుతో తన సందేహాన్ని వెలిబుచ్చారు. తాను ఇటీవల ఓ పెన్ కొనుగోలు చేశానని, దానికి ఆధార్ నంబర్ తో పాటు, ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చానని, అయితే తన ఖాతా నుంచి డబ్బులు మాత్రం కట్ అవలేదని సదరు అధికారిణి తన సందేహం గురించి చెప్పారు.
దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. బ్యాంకర్ల సమావేశంలో సమస్యపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.