'ఆ విషయం కేసీఆర్ను అడగాలంటే బాబుకు భయం, వాళ్లిద్దరూ మోసం చేశారు'
'నాగార్జున సాగర్ నుంచి కేసీఆర్ను నీరు అడగాలంటే చంద్రబాబుకు భయమని' గోపిరెడ్డి ఎద్దేవా చేశారు.
విజయవాడ: నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్లో సమృద్ధిగా నీరు చేరినా.. రబీపంటకు ప్రభుత్వం నీరు విడుదల చేయకపోవడంపై వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
శ్రీశైలం కుడికాలువ ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని కోరుతూ సోమవారం సాయంత్రం వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు, రైతులతో కలిసి ఎన్ఎస్పీ సూపరిండెంట్ ఇంజినీర్ వెంకటరమణారావుతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.
సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్లలో సోమవారం నాటికి 420 టీఎంసీల నీరు ఉన్నా ప్రభుత్వం నీటి విడుదలపై ప్రకటన ఎందుకు చేయట్లేదని ఎమ్మెల్యే గోపిరెడ్డి ప్రశ్నించారు. గతంలో సాగర్లో 530 అడుగుల నీటి నిల్వ ఉన్న సమయంలోనే సాగునీరు అందించినట్లు గుర్తుచేశారు.
స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి పత్తిపాటి పుల్లారావులు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు. 'గతేడాది రబీపంటకు నీరిస్తామని హామి ఇచ్చి వాళ్లిద్దరు మోసం చేశారు' అన్నారు. కనీసం సీఎంతో చర్చిస్తామని కూడా భరోసా ఇవ్వట్లేదని మండిపడ్డారు.
'నాగార్జున సాగర్ నుంచి కేసీఆర్ను నీరు అడగాలంటే చంద్రబాబుకు భయమని' గోపిరెడ్డి ఎద్దేవా చేశారు. సాగర్ డ్యామ్ తాళాలు ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వద్దే ఉన్నాయని, సాగునీరు అడిగే విషయంలో చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేవలం ఆరుతడి పంటలకే సాగునీరు ఇవ్వాలని కేబినెట్ లో సీఎం అనటం బాధాకరమన్నారు.
సీఎం తీరు చూస్తుంటే రైతులను ఆదుకునే ఉద్దేశం ఉన్నట్టు కనిపించడం లేదని గోపిరెడ్డి అన్నారు. గత మూడేళ్ల నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు సాగునీరు అందక అప్పులపాలై ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అయినా సరే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. దాళ్వాకు నీరివ్వాలని కోరుతూ ఎస్ఇ రమణారావుకు వినతిపత్రం సమర్పించారు.