ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు పథకంపై చంద్రబాబు కీలక ఆదేశాలు..!
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే సూపర్ సిక్స్ పథకం అమలుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలు చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ఇవాళ దీనిపై ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పథకం సాఫీగా అమలు చేసేందుకు వీలుగా వారికి దిశానిర్దేశం చేశారు. అలాగే పథకంలో భాగంగ చేపట్టాల్సిన కార్యక్రమాలపై కీలక ఆదేశాలు ఇచ్చారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ఇందుకు కొత్త బస్సులు కొనడం గానీ, అవసరమైతే అద్దెకు తీసుకోవడం గానీ చేయాలని సీఎం సూచించారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ ఈవీ ఏసీ బస్సులే ఉండాలన్నారు. ఇప్పుడున్న బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు. ప్రతీ బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలన్నారు.

ఆర్ధిక కష్టాలను అధిగమించాలంటే ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఖర్చు ఎలా తగ్గించుకోవాలి, ఇతర మార్గాల ద్వారా ఆదాయాలను ఎలా పొందాలనే దానిపై దృష్టి పెట్టాలన్నారు. సమర్ధత పెంచుకోవాలని కోరారు. బస్ కాంప్లెక్స్లో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచడం దగ్గర నుంచి బస్సు ప్రయాణం వరకు ప్రయాణికుల్లో సంతృఫ్తి పెరిగేలా నిర్వహణ ఉండాలన్నారు.
బ్యాటరీ స్వాపింగ్ విధానంతో ఆర్టీసీ బస్సుల నిర్వహణ వ్యయం తగ్గే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. డీజిల్, ఈవీ, సీఎన్జీ, బ్యాటరీ స్వైపింగ్ ఇలా ఏ బస్సు కొనుగోలు, నిర్వహణకు ఎంత వ్యయం అవుతుందనే ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. బ్యాటరీ, బ్యాటరీ లేకుండా, సర్వీస్ స్టేషన్లను ప్రైవేట్ సంస్థలు నిర్వహించడం, బస్సులను ఆపరేట్ చేయడం ఇలా ఏ విధానంతో వ్యయం తగ్గుతుందనేది పరిశీలించాలన్నారు. ఆర్టీసీనే పవర్ జనరేట్ చేసి ఈవీ బస్సులు వినియోగించగలిగితే ఎంతమేర మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుందనేది అంచనా వేయాలన్నారు.

మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు అదనంగా మరో 2,536 బస్సులు అవసరమని అధికారులు లెక్కలు తేల్చారు. దీనికి రూ.996 కోట్లు వ్యయం కానుందని తెలిపారు. అలాగే బస్ స్టేషన్లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణ, బస్సుల సమాచార బోర్డులు, ఇతర సౌకర్యాలను మెరుగుపరచాల్సి ఉందని సీఎంకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం జనాభా 5.25 కోట్లు ఉంటే మహిళలు 2.62 కోట్లు ఉన్నారని, వీరిలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో మహిళల ప్రయాణాల సంఖ్య ప్రస్తుతం ఏడాదికి 43.06 కోట్లుగా ఉందని తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు తర్వాత ఇది 75.51 కోట్లకు పెరగొచ్చని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రతి మహిళ సగటున వారానికి ఒకసారి అయినా ప్రయాణిస్తుంటారని తెలిపారు. అలాగే ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం మహిళల ప్రయాణాల సంఖ్య 6.85 కోట్లుగా ఉందన్నారు. పథకం అమలు తర్వాత ఈ సంఖ్య 13.39 కోట్లకు పెరగొచ్చన్నారు. మొత్తమ్మీద ఉచిత బస్సు పథకంతో మహిళలు ఏడాదిలో 88.90 కోట్ల సార్లు ప్రయాణించే వీలుందని తెలిపారు. అయితే ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మెరుగ్గా ఉండాలని సీఎం ఆదేశించారు.












Click it and Unblock the Notifications