జనానికి మాటిచ్చాం-దానికి తగ్గట్టు పనిచేయాల్సిందే-కలెక్టర్లకు తేల్చేసిన చంద్రబాబు
కలెక్టర్లు ఎప్పటికప్పుడు లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఇవాళ జరుగుతున్న జిల్లా కలెక్టర్ల భేటీలో పిలుపునిచ్చారు. కలెక్టర్ల సదస్సులు తనకు కొత్తేమీ కాదని, 1995లో సీఎం అయినప్పటి నుంచి ఎన్నోసార్లు తాను ఇలాంటి భేటీలో నిర్వహించానన్నారు. ఇవాళ జరుగుతున్న కలెక్టర్ల భేటీ ఓ చరిత్ర తిరగరాయబోతోందన్నారు. గతంలో ప్రజా వేదికలో కలెక్టర్ల సదస్సు పెట్టి ఆనాటి సీఎం.. ఆ సదస్సు పూర్తయ్యాక దాన్ని కూల్చేశారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ఐదేళ్లలో అన్ని రంగాల్లోనూ విధ్వంసం చేశారన్నారు.
గతంలో విభజన తర్వాత తాను తొలిసారి సీఎం అయినప్పుడు చాలా సమస్యలున్నా అధికారుల్లో నైతిక స్ధైర్యం ఉండేదని, ఎక్కడో ఒకచోట అవినీతి ఉండేదని, కానీ పనిచేసే అధికారుల్ని పక్కనబెట్టడం, బెదిరింపులకు దిగి బ్రాండ్ ఏపీని దెబ్బతీసారన్నారు. ఢిల్లీకి వెళ్తే ఒకప్పుడు ఏపీ నుంచి వచ్చిన అధికారులను గౌరవించే వారని, ఇక్కడి నుంచి వెళ్లిన వారు కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహించారని, రిజర్వు బ్యాంక్, ప్రపంచ బ్యాంకులకు వెళ్లారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఏపీ అధికారులంటే ఢిల్లీలో అంటరానివారుగా మారారన్నారు.

ఓ చిన్న తప్పు జరిగితే సరిదిద్ద వచ్చని, కానీ పూర్తిగా విధ్వంసం అయిన రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేయాలంటే అదనపు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చాలా కీలకమని, భావితరాల భవిష్యత్తును మార్చే శక్తి వాటికి ఉంటుందన్నారు. ఆర్ధిక సంస్కరణలు రాకముందు కూడా ఇదే ప్రభుత్వాలు, ఇదే ప్రజలని కానీ వాటి తర్వాత పోటీతత్వం పెరిగి ఇవాళ 2047కి సూపర్ పవర్ గా తయారయ్యే అవకాశాలున్నాయన్నారు. 2029 కల్లా మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. 2041కి ప్రపంచంలో టాప్ లో ఉంటామన్నారు.
గత ఐదేళ్లలో అందరూ ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు గుర్తుచేశారు. కాబట్టే ఈసారి ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారన్నారు. ఈసారి ఎప్పుడూ రానంత గొప్ప మెజార్టీ ఇచ్చారన్నారు. దానికి తగ్గినట్లుగానే ప్రజల ఆశలు కూడా భారీగానే ఉన్నాయన్నారు. ప్రజలు గెలవాలంటే ఎన్డీయే గెలవాలని, రాష్ట్రానికి పునర్ వైభవం తెస్తామని పవన్, తానూ హామీ ఇచ్చామన్నారు. కానీ పునర్ నిర్మాణం చేయాలంటే చాలా సమస్యలు ఉన్నాయన్నారు. ఈ కలెక్టర్ల భేటీ రాష్ట్ర పునర్ నిర్మాణానికి అంకితమవడానికి దశ, దిశ నిర్దేశిస్తుందన్నారు. పోయిన బ్రాండ్ ను తిరిగి తెచ్చుకోవాలని, ఏపీ అధికారులంటే ఎలాంటి వారూ చూపించాలన్నారు.
గత ఐదేళ్లలో ఒక్క కలెక్టర్ల భేటీ పెట్టలేదంటే పాలన ఎలా సాగిందో అర్దం చేసుకోవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. కలెక్టర్ల భేటీ అనేది మంచి సంప్రదాయమన్నారు. ఇకపై మూడు నెలలకో కలెక్టర్ల సదస్సు ఏర్పాటు చేసుకొందామన్నారు. అయితే అది గంటల తరబడి ఉండదన్నారు. ఇప్పటికే తాను ప్రసంగాలతో ఎక్కువ సమయం వృథా చేయడం లేదన్నారు. ఇకపై కలెక్టర్ల భేటీలు కూడా అలాగే ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో అందరి పనితీరు మదించి సరైన అధికారిని సరైన చోట ఉంచి పనిచేయిస్తామన్నారు. తన పనితీరును కూడా మదింపు చేసుకొంటానన్నారు.

ఏ సమస్య వచ్చినా మానవతా దృష్టితో పరిష్కరించడం, పని చేయించడం మీవల్లే అవుతుందని చంద్రబాబు తెలిపారు. తాజాగా తాను పార్టీ కార్యాలయంలో వినతులు తీసుకుంటే దాదాపు 5 వేల ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో చాలా మటుకు భూముల కబ్జాలే అన్నారు. ఇది ఎప్పుడూ చూడని పరిస్ధితి అన్నారు. అందుకే తొలి కేబినెట్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు చేశామని, భూముల సర్వేను కూడా నిలిపేశామన్నారు. పేదరిక నిర్మూలన కోసం కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
తాము నియంతలం కాదని, నియంతలు అనుకున్న వారెవరూ ఎన్నికల్లో తిరిగి గెలవలేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఐదేళ్ల తర్వాత తాము తిరిగి ప్రజలతో ఓట్లేయించుకుని ఇక్కడికి వస్తామని, లేకపోతే అసెంబ్లీకి కూడా రామని తెలిపారు. తప్పులు చేయమని చెప్పడం లేదని, ప్రజాప్రతినిధులు వాస్తవాలు చెప్పినప్పుడు వాటిని విని పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం చేసే ప్రతీ కార్యక్రమాన్నీ తాము ఓనర్ షిప్ తీసుకోవాలన్నారు. చెట్ల నరికివేత, రెడ్ కార్పెట్లు వేయడం, బలవంతపు జనసేకరణలు వద్దన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే హోదా వచ్చిందని, కానీ తిరిగి వారిని ఇబ్బంది పెట్టకూడదన్నారు.
త్వరలో పాలన అంతా రియల్ టైమ్ లో జరిగేలా ఓ యాప్ అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు తెలిపారు. అందులో అందరినీ భాగస్వాముల్ని చేస్తామన్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు జరిగితే టీడీపీ కార్యకర్త ఎస్సై చొక్కా పట్టుకున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీడియో ను ప్రదర్శించారు. తమ ప్రభుత్వంలో రాజకీయంగా ప్రత్యర్దులను టార్గెట్ చేయబోమన్నారు.












Click it and Unblock the Notifications