టీడీపీ రాష్ట్రకమిటీ భేటీ-పొత్తులపై చంద్రబాబు స్పందన ఇదే-ఆ ఛానళ్లకు దూరం పెట్టాలని సూచన
ఇవాళ అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ భేటీ జరిగింది. ఇందులో ముందుగా పార్టీ జెండా ఎగురవేసిన చంద్రబాబు... అనంతరం ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో తాజా పరిస్ధితులు, అందులో టీడీపీ పాత్ర, భవిష్యత్ రాజకీయాలు వంటి అంశాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ సేవల్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
Recommended Video
తెలుగు దేశం జాతీయ భావాలు ఉన్న ప్రాంతీయ పార్టీ అని, టీడీపీ గత విజయాలు నెమరవేసుకోవాలని,ప్రజలకు వాటిని గుర్తు చేయాలని చంద్రబాబు సూచించారు. ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం అవసరాన్ని నాడు చాటి చెప్పామన్నారు. కానీ ఇవాళ పరిస్ధితులు చూస్తుంటే పాలకుడికి ఉండాల్సింది విజన్ కానీ విద్వేషం కాదని చంద్రబాబు తెలిపారు. నేడు ఎక్కడ చూసినా విద్వేషమే ఉందని, పాలకుల విజన్ పోయి పాయిజన్ గా తయారయ్యిందన్నారు.తమకు రావాల్సిన బకాయిలపై అనంతపురంలో కానిస్టేబుల్ ప్లకార్డు పట్టుకున్నాడని, దీంతో ఆయనను టార్గెట్ చేశారని, ఉద్యోగం నుంచి తొలగించారని చంద్రబాబు ఆరోపించారు. కానిస్టేబుల్ తనను వేధించలేదు అని చెప్పిన శ్రీలక్ష్మిని వేధిస్తున్నారన్నారు. కానిస్టేబుల్ ప్రకాష్ ఇప్పుడు కనపడడం లేదన్నారు. సమస్యల్ని ప్రస్తావిస్తే..దాడులు, వేధింపులకు పాల్పడుతున్నారన్నారు
నాడు విజన్ తో చేసిన పాలనతో ఇప్పుడు హైదరాబాద్ మంచి స్థానంలో ఉందని, ప్రపంచంలో తెలుగుజాతి ఉన్నత స్థితిలో ఉండడమే తనకు అన్నిటికంటే సంతృప్తి అని చంద్రబాబు అన్నారు. 27 ఏళ్ల క్రితం మనం చేసిన పనులు, ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయన్నారు. అమెరికాలో ఉండే అమెరికన్ ఆదాయం 65 వేల డాలర్లని, కానీ అక్కడ ఉన్న ఇండియన్స్ ఆదాయం 1.25 లక్షల డాలర్లని చంద్రబాబు గుర్తుచేశారు.

కానీ మన దగ్గర పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయిందన్నారు. విభజన వల్ల నష్టం జరిగిందని, అయినా నాడు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామన్నారు.200 పెన్షన్ 2000 చేశామని,ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. జగన్ ఇప్పుడు ఒక్కో కుటుంబం పై మూడేళ్లలో 3.25 లక్షల భారం వేశారన్నారు. దేశంలో ఎక్కువ పెట్రో ధరలు ఉండే రాష్ట్రం ఏపీయే అన్నారు. వృత్తి పన్ను, ఆస్థిపన్ను, చెత్త పన్ను అని ఇష్టం వచ్చినట్లు పన్నులు వేశారన్నారు.
టీడీపీ పెట్టిన అన్నా క్యాంటీన్ రద్దు చేశారని, ఇప్పుడు అన్నదానం చేస్తున్న వారిపైనా దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. నాడు డొక్కా సీతమ్మ అన్నదానం చేశారని, అన్నదానానికి ఆమే స్ఫూర్తి అని తెలిపారు.నందిగామలో చివరికి కోర్టుకు వెళ్లి అన్నక్యాంటీన్ నిర్వహణకు అనుమతులు తెచ్చుకున్నామన్నారు. రాష్ట్రంలో అటు పన్నుల భారం, ఇటు అప్పుల భారం పెరిగిపోయిందన్నారు. ఎస్సీలకు ఉన్న 26 పథకాలు రద్దు చేశారని, సబ్ ప్లాన్ తీసేశారన్నారు.
చింతూరులో వరదల సమయంలో సీఎం జగన్ పిలిచి మాట్లాడిన బాలిక డెంగ్యూవచ్చి చనిపోయిందని, దీనికి సిఎం ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ హత్య కాదా అన్నారు.వరద ప్రాంతంలో దోమల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోలేదని చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వాన్నిప్రశ్నించారు.విదేశీ విద్యను ఆపేశారని, బీసీలకు ఒక్క పథకం లేదన్నారు. కాపు కార్పొరేషన్ కు నిధులు లేవని, రాష్ట్రంలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేరన్నారు. కనీసం ధాన్యం డబ్బులు కూడా చెల్లించడం లేదని, దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.
రాష్ట్రంలో ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు అంతా రోడ్డున పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. చేనేత, గీత, మత్స్య కారులు, ఆటో డ్రైవర్లు...ఇలా అన్నీ వర్గాలు జగన్ పాలనలో దెబ్బతిన్నారన్నారు. పక్క రాష్ట్రం నుంచి మద్యం తెచ్చేవారికి నో చెక్ పోస్ట్...గంజాయి తెచ్చే వారికి చెక్ పోస్ట్ లేదన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు మాత్రం చెక్ పోస్ట్ లు పెడుతున్నారన్నారు.

ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్నారని, పోలవరం, అమరావతి పూర్తి చేస్తాం అన్నారని, మద్య పాన నిషేదం చేస్తేనే ఓటు అడుగుతాం అన్నారని, కానీ 25 ఏళ్ల మద్యం అమ్మకాలపై అప్పులు తెచ్చారన్నారు. దేశంలో దళితులు, గిరిజనులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని, రాష్ట్రంలో ఆడబిడ్డలపై 31 శాతం దాడులు పెరిగాయన్నారు. ఈ విషయాలు నేషనల్ క్రైం బ్యూరో చెపుతున్న నివేదికలోవేనన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు కానీ...వైసీపీ ఆదాయం మాత్రం భారీగా పెరిగిందన్నారు.
జగన్ ఈ మూడేళ్లలో 2లక్షల కోట్లు అక్రమంగా ఆర్జించారని చంద్రబాబు తెలిపారు. లేపాక్షిలో భూములు కొట్టేశారని, 20 కోట్లు ఆదాయం లేని కంపెనీతో 500 కోట్లు పెట్టి వేల కోట్ల భూములుకొట్టేశారన్నారు. సొంత కంపెనీకి మైనింగ్ ఇచ్చారని హేమంత్ సోరెన్ సభ్యత్వం రద్దుపై ప్రతిపాదనలు చేశారని, సరస్వతీ భూముల విషయంలో జగన్ చేసిన దానికి ఏమి చెయ్యాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని, కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలిచిన పానెల్ ను జగన్ రద్దు చేశారని ఆక్షేపించారు. హైకోర్టు చీవాట్లు పెట్టి మళ్లీ వారికే అధికారం ఇచ్చిందని గుర్తుచేశారు.
సంస్థాగత విషయాల్లో రాజీ పడేది లేదని టీడీపీ నేతలకు చంద్రబాబు తెలిపారు. సభ్యత్వ నమోదు పూర్తి చెయ్యాలని, పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి వరకు కమిటీలు పూర్తి చెయ్యాలని ఆదేశించారు. ఓటర్లు వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే మన ఓట్లు ఉండవన్నారు. ప్రజల్లో ఎంత చైతన్యం ఉన్నా మన ఓట్లు లేకపోతే ఏమీ చెయ్యలేం. జాగ్రత్తగా ఉండాలన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల విషయంలో పార్టీ నేతలు బాధ్యత తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో ఇంత అరాచకం ఉంటే కొన్ని టీవీలు తిరిగి మనల్నే విమర్శిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నీలిమీడియా గా ఉన్న టీవీ9, ఎన్టీవీని దూరంగా పెట్టాలన్నారు. వారికి బాధ్యత గుర్తు చెయ్యాలన్నారు. నేతలు సొంత సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకోవాలని, విస్తృతంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించారు.దుర్మార్గుల చేతిలో టెక్నాలజీ ఉంటే మరింత ఎక్కువ నష్టమని, అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ఇంట్లోంచి టిడిపి నేతలు భయటకు వస్తే కేసులు పెడుతున్నారని, జగన్ కు నిద్రలో కూడా టీడీపీ నేతలే గుర్తుకు వస్తున్నారన్నారు. పోలీసులు లేకుండా వైసీపీ వాళ్లు వస్తే ఒక్క నిముషంలో వారి పని తేలిపోతుందన్నారు.
టీడీపీ నేతలు తమ సౌకర్యం కోసం ఇంట్లో పడుకుంటే....ఎన్నికల అనంతరం కూడా ఇంట్లో ఉండాల్సి వస్తుందన్నారు. కేసులు, దాడులపై న్యాయ పరంగా, రాజకీయంగా పోరాడుతామని, ఎవరిని వదలబోమన్నారు.ఇప్పటికీ నాపై కేసులు పెట్టేందుకు వెతుకుతున్నాడని, మన పేరు చెప్పమని కేసులు పెట్టి బాధితులను ఒత్తిడి చేస్తున్నాడన్నారు. జగన్ అక్రమాలకు అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, అవినీతి బుదర మనకూ అంటించే ప్రయత్నం చేస్తున్నాడని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికలకు 18 నెలల సమయం ఉందని, జగన్ ఇంకా ముందు ఎన్నికలకు వెళితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందన్నారు. ఇప్పుడు ఎక్కడా పొత్తుల గురించి తాను మాట్లాడడం లేదని, పార్టీలో కూడా ఈ విషయంలో క్లారిటీ ఉండాలన్నారు. ముందు రాష్ట్రాన్ని కాపాడాలి...దానికి అందరూ కలిసి రావాలన్నారు. మేథావులు, ఉద్యోగులు సహా అందరూ కలిసి రావాలన్నారు.
టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ 10 రోజులు నియోజకవర్గంలో ఉండాలని నియోజకవర్గ అబ్జర్వర్ 8 రోజులు నియోజకవర్గంలో ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిలుగా ఉంటారన్నారు. వారిని గెలిపించే బాధ్యత పార్టీ నేతలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర పునర్ నిర్మాణం సాధ్యమన్నారు. అప్పట్లో ఎక్కువ సమయం పార్టీకి పెట్టలేదు కాబట్టి సమస్యలు వచ్చాయని, పార్టీపై దృష్టిపెట్టిన సందర్భంలో మనకు ఓటమి లేదన్నారు. తాను పాలనలో పడిపోయినప్పుడే సమస్యలు వచ్చాయని, దాన్ని సరి చేసుకుంటున్నానన్నారు. క్విట్ జగన్-సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం అమల్లోకి తేవాలన్నారు.












Click it and Unblock the Notifications