ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం-పూర్తి వివరాలివే..!
ఏపీలో కూటమి సర్కార్ (ap govt) మరో కొత్త పథకాన్ని ఇవాళ ప్రారంభించింది. రాష్ట్రంలో ఇప్పటికే మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం (free bus)కల్పిస్తున్న ప్రభుత్వం.. ఇవాళ దివ్యాంగశక్తి (divyang shakti) పథకం ద్వారా దివ్యాంగులకు సైతం ఈ అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం చంద్రబాబు దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం అందించేలా దివ్యాంగశక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
ఇవాళ మంగళగిరి బస్టాండ్ వద్ద ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు (chandrababu), మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. మంగళగిరి బస్టాండ్ నుంచి పాత మంగళగిరి రూట్ లో వీరు బస్సు ప్రయాణం చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. దివ్యాంగులతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ పల్లె వెలుగు బస్సులో వారితో పాటు ప్రయాణించారు. డాన్ బాస్కో స్కూల్ మీదుగా డోలాస్ నగర్, ప్రకాశ్ నగర్, నులకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాక బస్టాప్ కు బస్సు చేరుకుంది.

ఈ పథకం ద్వారా ఏపీఎస్ఆర్టీసీ లోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. 21 కేటగిరీల్లో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ పథకం అమలు చేయబోతున్నారు. దివ్యాంగులకు వారి సహాయకులతో కలిపి 12.76 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం కల్పించేలా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ పథకం కోసం ఏటా రూ.207 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.












Click it and Unblock the Notifications