జంగిల్ రాజ్ పాలనలో ప్రజలకు భద్రత కరువు: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా పెరుగుతున్న నేరాలపై టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. గత నాలుగు రోజుల్లో రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలు, రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్ రేట్ వివరాలను లేఖలో వెల్లడించిన చంద్రబాబు, నేరాలను అదుపు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు అంటూ మండిపడ్డారు. గత నాలుగు రోజుల్లో రాష్ట్రంలో జరిగిన వివిధ సంఘటనలకు సంబంధించిన వివరాలను పేర్కొని, ఆయా ఘటనల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ లేదని పేర్కొన్న చంద్రబాబు, జగన్ పాలనలో లా అండ్ ఆర్డర్ విచ్ఛిన్నమైంది అంటూ ఆరోపించారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో వివిధ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. జంగిల్ రాజ్ పాలనలో ప్రజలకు భద్రత కరువైందని చంద్రబాబు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గుండాలు పెట్రేగిపోతున్నారని, వారిని కంట్రోల్ చేయడంలో పోలీస్ శాఖ విఫలమవుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వివిధ నేరాలను ప్రస్తావించిన చంద్రబాబు జీ కొత్తపల్లి లో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కారణమని మృతుడి భార్య స్వయంగా చెప్పినా పోలీసులు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి పాల సొసైటీ ఎన్నికలలో నామినేషన్ వేయడానికి వెళుతున్న వారిపై దాడి నివారించటంలో పోలీసులు విఫలమయ్యారని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటే రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళపై అత్యాచార ఘటన జరిగేది కాదని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా మద్యం, గంజాయి వాడకం పెరిగిందని పేర్కొన్న చంద్రబాబు రాష్ట్రంలో పెరుగుతున్న హింసకు, నేరాలకు ఇదే కారణమంటూ వ్యాఖ్యానించారు. గంజాయి రవాణాలో వైసీపీ నేతల ప్రమేయం ఉన్నప్పటికీ పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా పట్టపగలు గన్ తో బెదిరించి అనకాపల్లి జిల్లా కసింకోట లో బ్యాంకు దోపిడీ జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ఎర్రచందనం అక్రమ రవాణాపై ఏపీ పోలీసులు స్పందించలేదని పేర్కొన్న చంద్రబాబు కర్ణాటక పోలీసులు వైసీపీ ఎంపీటీసీని అరెస్ట్ చేశారని గుర్తు చేశారు.
ఏపీ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లిన డ్రగ్స్ కేసులో ఒకరిని అరెస్టు చేసి దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరాలలో నిందితులపై కఠిన శిక్షలు తీసుకోవడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులు దృష్టి పెట్టాలని చంద్రబాబు హితవు పలికారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుంటే, నేరస్తులు ఎటువంటి భయం లేకుండా దారుణ ఘటనలకు పాల్పడుతూనే ఉంటారని చంద్రబాబు లేఖ ద్వారా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి తెలియజేశారు.