ఇక చంద్రబాబు ‘మన్ కీ బాత్’!: త్వరలో మోడీ బాటలో ప్రజలతో మమేకం
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ బాటలోనే ఏపి సిఎం చంద్రబాబునాయుడు కూడా ప్రజలతో మమేకమయ్యేందుకు రేడియో/ టీవీ ఛానల్స్ను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఓ మంత్రితోపాటు మరో ప్రభుత్వ సలహాదారు, సీనియర్ అధికారితో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది.
ప్రధాని మోడీ ప్రతి నెలలో చివరి ఆదివారం ఉదయం 11గంటలకు ‘మన్ కీ బాత్' పేరిట ప్రజలతో మాట్లాడుతున్న విషయం తెలిసిందే. మన్కీ బాత్ పేరిట ప్రసారమవుతున్న కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభంలో కేవలం ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమం, తర్వాత టీవీ ద్వారా కూడా ప్రసారమవుతోంది.
కేంద్రం పరిధిలోని ప్రసారభారతి ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు భారీఎత్తున ప్రచారం నిర్వహించింది. ప్రారంభంలో పెద్దగా స్పందన లేకున్నా.. తర్వాత ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతినెలా ఏదోక అంశంపై ప్రజలతో ప్రధాని మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పటికి 14 పర్యాయాలు కార్యక్రమం ప్రసారమైంది.
ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోడీ తొలుత తన మనోభావాలను ప్రజలకు తెలియచేస్తున్నారు. తర్వాత ప్రజాభిప్రాయాలు వింటూ, వారి సమస్యలను నోట్ చేసుకుని పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరిపాలనలో తీసుకోవాల్సిన మార్పులు, చేర్పులకు ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతోందని తెలుస్తోంది.

చంద్రబాబు కూడా ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రచార సాధనాలను వినియోగించుకుంటున్నారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నప్పటి నుంచే చంద్రబాబు మీడియాతో సన్నిహితంగా ఉంటున్నారు. చంద్రబాబు చేపట్టే పథకాలు, కార్యక్రమాలకు ప్రచారం లభించేందుకు మీడియాను ఉపయోగించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పొచ్చు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలు అన్ని స్థాయిల ప్రజలకు అందించేందుకు మన్కీ బాత్ లాంటి కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని చంద్రబాబు తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దీనివల్ల తాను ప్రజలకు చెప్పదలచుకున్నది యథాతథంగా ప్రజలకు చేరుతుందని, అలాగే ‘ఫీడ్ బ్యాక్' లభిస్తుందని బాబు ఆలోచనగా తెలుస్తోంది.
వీలైనంత త్వరగా ఈ ఆలోచనకు ఒక రూపు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. బాబు ప్రసంగాన్ని కేవలం ఆకాశవాణి (రేడియో), దూరదర్శన్ల ద్వారా మాత్రమేకాకుండా ఎఫ్ఎం స్టేషన్లు, ప్రైవేట్ టీవీ ఛానళ్ల ద్వారా కూడా ప్రసారమయ్యేలా చూసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిసింది. రేడియో, దూరదర్శన్ల ద్వారా ప్రసారాల కోసం కేంద్రం అనుమతి అవసరం ఉంటుంది.
అయితే, కేంద్రం నుంచి అనుమతి రావడం చంద్రబాబుకు పెద్ద సమస్య కాదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అన్ని కోణాల్లో అలోచించి పకడ్బందీ ప్రణాళికతో చంద్రబాబు ప్రజల ముందుకు త్వరలో వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.












Click it and Unblock the Notifications