చంద్రబాబు కొత్త అవతారం.. : రేషన్ సరుకులపై ఎలా ఆరా తీస్తారంటే..
విజయవాడ : కస్టమర్ల ఫీడ్ బ్యాక్ గురించి తెలుసుకోవడానికి, కొత్త ఆఫర్స్ కు సంబంధించిన విషయాలను తెలియజేయడానికి ఆయా మొబైల్ కంపెనీల కాల్ సెంటర్ల నుంచి వినియోగదారులకు ఫోన్ కాల్స్ రావడం ప్రస్తుత కాలంలో దాదాపుగా ప్రతి ఒక్కరికి అనుభవమే.
ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా త్వరలోనే 'రేషన్ తీసుకున్నారా..!' అంటూ కాల్ సెంటర్ వ్యక్తుల తరహాలో ఏపీ ప్రజలను పలకరించబోతున్నారు. ఎవరైనా సరే, రేషన్ సరుకులు అందుకున్న వెంటనే ఇకనుంచి ఓ ఫోన్ కాల్ రానుంది.

ఆ ఫోన్ కాల్ లో ఉన్న సీఎం రికార్డెడ్ వాయిస్ 'ఈ నెలలో మీరు సరుకులు తీసుకున్నారు. సంతోషం. ధన్యవాదాలు' అంటూ రేషన్ సరుకులను తీసుకున్న ప్రజలను మొబైల్ ద్వారా పలకరించనుంది. అయితే ఈ ఫోన్ కాల్స్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటంటే.. నకిలీలలకు చెక్ పెట్టడం.
ఫోన్ కాల్ వచ్చేటప్పటికీ లబ్దిదారుడికి సరుకులు అందకపోయినా..! లేక ఆ సరుకులు పక్కదారి పట్టినా..! ఈ ఫోన్ కాల్ తో అవన్నీ తేటతెల్లమవుతాయి. ఫోన్ కాల్ వచ్చినా, తనకు సరుకులు అందలేదంటే సరుకుల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని లబ్దిదారుడు అప్రమత్తమయ్యే అవకాశముంటుంది. ఒకవేళ అప్పటికే సరుకులు లబ్దిదారునికి అంది ఉంటే, చంద్రబాబు రికార్డెడ్ వాయిస్ చెప్పినట్టు సంతోషంగానే భావిస్తారు.
ఇకపోతే రేషన్ సరుకుల విషయంలో పోర్టబులిటీ విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విధానం గనుక అందుబాటులోకి వస్తే, ఫలానా వార్డులోనే రేషన్ తీసుకోవాలన్న నిబంధనేమి ఉండదు. ఎక్కడినుంచైనా లబ్దిదారులు తమ రేషన్ సరుకులు పొందవచ్చు. వలస కూలీలుగా జీవనోపాధి సాగిస్తున్న చాలామంది ప్రజలకు ఈ విధానం ప్రయోజనకరంగా మారనుంది.












Click it and Unblock the Notifications