ఓటుకు నోటు కేసులో క్వాష్ పిటిషన్: గతంలో చంద్రబాబు స్టే తెచ్చుకున్న కేసులివే!
అమరావతి: 'ఆ కేసులో ఏముంది నేను మాట్లాడటానికి, మీరే అధ్యయనం చేసి చెప్పండి' ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వుల అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు చెప్పిన సమాధానం ఇది. 'నేను నిప్పులా బతికాను. నీతి, నిజాయితీలే నా ఆస్తి, అందువల్లే వైయస్ రాజశేఖరరెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం నాపై 11 సభా సంఘాలు, నాలుగు న్యాయ విచారణలు, నాలుగు మంత్రివర్గ ఉపసంఘాలు, మూడు పరిపాలనా పరమైన విచారణలు, ఓ సీఐడీ విచారణ. ఒక్కదానిలోనైనా నిరూపించగలిగారా?' తనపై ఎప్పుడు ఆరోపణలు వచ్చినా చంద్రబాబు చేప్పే మాటలివి.
చంద్రబాబు నాయుడిపై ఎప్పుడు ఆరోపణలు వచ్చినా ఆయన విచారణకు నిలపడలేదన్న విషయం అందరికీ తెలిసిందే. తనపై ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ, కోర్టులు విచారణకు ఆదేశించినా సాంకేతిక కారణాలు చూపుతూ స్టేల కోసమే ప్రయత్నించారే తప్ప విచారణను ఎదుర్కోలేదు.
నిలబడుతుందా..? నీరుగారుతుందా..? : అసలేంటీ క్వాష్ పిటిషన్? తాజాగా ఓటుకు నోటు కేసులో కూడా ఇదే జరిగింది. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పాత్రను తేల్చాలని ఏసీబీ కోర్టులో వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు కేసును పునర్విచారణ చేసి ఈ నెల 29లోపు సమగ్ర నివేదికను సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

మంగళవారం కోర్టు ఉత్తర్వులు వెలువడగా, ఆ తర్వాత రెండు రోజులు పాటు గంభీరమైన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు గురువారం హడావుడిగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం అటు రాజకీయవర్గాల్లో, ఇటు సాధారణ ప్రజానీకంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తనపై దర్యాప్తు నిలుపుదల కోరుతూ హైకోర్టు కెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
ఉత్కంఠ, ఏమవుతుందో?: చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ నేడే! గతంలో కూడా తనపై ఆరోపణలు వచ్చినప్పుడు చంద్రబాబు పలు కేసుల్లో స్టే తెచ్చుకున్న సందర్భాలు:
* చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఏలేరు కుంభకోణం బైటపడింది. చంద్రబాబుకు ప్రత్యక్ష ప్రమేయముందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో ఆయన స్టే తెచ్చుకున్నారు.
* మద్యం డిస్టిలరీలకు అనుమతి వ్యవహారంలో చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని కాంగ్రెస్ నేత కృష్ణకుమార్ కోర్టును ఆశ్రయించటంతో ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కూడా చంద్రబాబు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.
* చంద్రబాబు ఆస్తులతో పాటు అవినీతిపై వైయస్ విజయమ్మ వేసిన పిటీషన్పై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో కూడా చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించి ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయించుకున్నారు.
* తాజాగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాల్సిందిగా ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేయటంతో వాటిని నిలుపుదల చేయించుకునేందుకు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications