ఆ స్పృహలో ఉండండి!: 2018 అత్యంత కీలకం, లక్ష్యాలకు బాబు 'డెడ్ లైన్'
వచ్చే ఏడాది దాదాపు ఎన్నికల ఫీవర్ తోనే గడుస్తుంది కాబట్టి.. చేయాల్సిన పనులేమైనా ఉంటే ఇప్పుడు చక్కబెట్టుకోవాలని సీఎం మంత్రులకు సూచిస్తున్నారు.
అమరావతి: వైసీపీ ప్లీనరీ తర్వాత అప్రమత్తమైన టీడీపీ.. ప్రత్యర్థి వ్యూహం ముందే తెలిసిపోవడంతో అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. వచ్చే ఏడాది దాదాపు ఎన్నికల ఫీవర్ తోనే గడుస్తుంది కాబట్టి.. చేయాల్సిన పనులేమైనా ఉంటే ఇప్పుడు చక్కబెట్టుకోవాలని సీఎం మంత్రులకు సూచిస్తున్నారు.
ఈ మేరకుటీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు నేతలకు దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఏడాది ఎన్నికల ఏడాది అని ప్రతీ ఒక్కరూ గుర్తెరగాలని సూచించారు. అనుకున్న లక్ష్యాలను ఈ ఏడాది లోపే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుల నుంచి మంత్రుల వరకు పనితీరును విశ్లేషించనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 1నుంచి అక్టోబర్ 30వరకు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపట్టి విజయవంతం చేయాలని నేతలతో పేర్కొన్నారు. అధికారంలో ఉన్నామనే స్పృహ నేతలు అన్నివేళలా గుర్తుంచుకోవాలన్నారు. ఎవరికి వారు కాకుండా.. అంతా కలిసి ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేయాలని సూచించారు. అలా అయితేనే ప్రజాదరణ పొందుతామని పేర్కొన్నారు.
తెలియక చేసినా.. పొరపాటున చేసినా.. జనం తప్పును తప్పుగానే చూస్తారన్న సంగతి ఎప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. పట్టిసీమ నిర్మాణం ద్వారా తొలిసారి జులైలోనే కృష్ణా ఆయకట్టుకు సాగునీరు ఇచ్చామని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు గుర్తుచేశారు.