మోసం.. నయవంచన: పాలన చేతకాదంటూ జగన్ సర్కారుపై చంద్రబాబు నిప్పులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా జగన్ పరిపాలన తీరును ట్విట్టర్ వేదికగా ఏకిపారేశారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని, కక్షసాధింపులు తప్పులు తప్ప అభివృద్ధి లేదని మండిపడ్డారు.

పరిపాలన చేతకాక...
‘పరిపాలన చేతకాక వ్యవస్థలన్నిటినీ దిగజార్చి, ఆర్థికంగా కుదేలు చేసి.. ఇప్పుడా భారాన్ని ప్రజల మీద వేయడం ఎంత దుర్మార్గం. ఆర్టీసీ బస్సు చార్జీలు, పెట్రోలు చార్జీలు, ఫైబర్ గ్రిడ్ చార్జీలు, ఇప్పుడు విద్యుత్ చార్జీలు... సామాన్యుడి మీద ఏంటీ ఆర్థిక భారం?' అని చంద్రబాబు జగన్ సర్కారును నిలదీశారు.

విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసి..
‘విద్యుత్ ఒప్పందాల రద్దు దేనికి అని అడిగితే ప్రజల మీద కరెంటు చార్జీల భారం తగ్గించడానికి అన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు పెంచారు? ఇప్పటికే పరిశ్రమలకు రాయితీలను ఇవ్వడం ఆపేసారు. ఇప్పుడీ కరెంటు చార్జీల భారంతో పరిశ్రమలు ఎలా నిలదొక్కుకుంటాయి?' అని చంద్రబాబు ప్రశ్నించారు.

పరిశ్రమల గల్లంతు స్థానంగా మారింది..
‘ఇప్పటికే మీ వేధింపులు, బెదిరింపులకు అనేక పరిశ్రమలు వెళ్లిపోయాయి. ఇప్పుడీ చార్జీల భారంతో వున్నవాళ్లు కూడా వెళ్లిపోయేలా చేస్తున్నారు. నాడు టీడీపీ హయాంలో "పెట్టుబడుల గమ్యస్థానం" అనిపించుకున్న ఏపీ, నేడు వైసీపీ పాలనలో "పరిశ్రమల గల్లంతు స్థానం" అవడం బాధేస్తోంది' అని చంద్రబాబు దుయ్యబట్టారు.

నమ్మించి మోసం.. నయవంచన...
‘భవిషత్తులో కరెంట్ చార్జీలు పెంచేది లేదని చెప్పిన మాట నిలబెట్టుకుంది తెలుగుదేశం. చార్జీలు పెంచం అని నమ్మించి మోసం చేసింది వైసీపీ. ఒక్క ఛాన్స్ ఇమ్మని కాళ్ళు గడ్డాలు పట్టుకుని, అధికారంలోకి వచ్చింది, ఇలా మోయలేని భారాలు ప్రజలపై వేసేందుకేనా? ఇదేనా మీ విశ్వసనీయత? ఇది నయవంచన కాదా?' అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో కక్షసాధింపులు తప్ప అభివృద్ధి జరగడం లేదని మండిపడ్డారు. అధికారులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని, పాలన చేతకాక కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఐటీ దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నారని.. తాము భయపడబోమని.. ఎందాకైనా వెళతామని చంద్రబాబు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications