పీఆర్పీ ఎఫెక్ట్: చిరంజీవిపై పరోక్షంగా చంద్రబాబు షాకింగ్ కామెంట్స్?
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహానాడులో చేసిన ప్రసంగం వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఇప్పటి దాకా ఎన్నో పార్టీలు వచ్చాయని, కానీ వాటిని మూసేసుకొని వెళ్లారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు నాడు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవిని ఉద్దేశించి అని ఉంటారని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలలో ఇటీవలి కాలంలో వచ్చి కనుమరుగైన పార్టీలలో ప్రజారాజ్యం పేరే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత లోక్సత్తా. అయితే, లోక్సత్తా దారి వేరు.
మహానాడు ప్రసంగంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నో పార్టీలు వచ్చాయని, కానీ అవేవీ నిలబడలేదని, మూసేసుకొని వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా అయినా ప్రజారాజ్యం పార్టీని ఉద్దేశించే అని అంటున్నారు.
మహానాడులో వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల పైన చంద్రబాబు నేరుగా విమర్శలు గుప్పించారు. కానీ ప్రజారాజ్యం పైన మాత్రం పరోక్షంగా అన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు ప్రత్యేక హోదా అంశం పైన కూడా స్పందించారు. కొందరు తాను దాని గురించి మాట్లాడటం లేదని రాజకీయం చేస్తున్నారని, అది సరికాదని, ఇది రాజకీయాలకు సమయం కాదని అభిప్రాయపడ్డారు. అందరం కలిసి ముందుకు సాగుదామని చెప్పారు.
ప్రత్యేక హోదా పైన పెద్దగా చంద్రబాబు స్పందించలేదు. కానీ దానిని ఉద్దేశించి మాత్రం రాజకీయం చేయవద్దన్నారు. అలాగే, కేంద్రం నుంచి ఇంకా సహకారం కావాలన్నారు. మిగతా రాష్ట్రాల వలే ఏపీ కూడా సమానంగా ఎదిగే వరకు సహాయం చేయాలన్నారు.