నాకు పదేళ్లు అవకాశమున్నా వచ్చేశా: పవన్-జగన్కు చంద్రబాబు కౌంటర్
విశాఖ: ప్రత్యేక హోదాతో సమానమైన నిధులు ప్యాకేజీతో ఇస్తామని కేంద్రం చెప్పిందని, దీంతో రాష్ట్రానికి మంచి జరుగుతుందనే తాను దానిని అంగీకరించానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ జిల్లా చోడవరంలో నిర్వహించిన జన చైతన్య యాత్రలో ఆయన హోదాపై మాట్లాడారు.
ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు అంగీకరించారని వైసిపి అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు పైవిధంగా స్పందించారు. హోదాతో అన్ని వస్తాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజల కోసం తన కంటే ఎక్కువగా ఆలోచించే వారు ఎవరు ఉన్నార్ననారు. అన్ని ఇళ్లకు విద్యుత్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే అన్నారు. కార్యకర్తలు.. ప్రజల మధ్యే ఉంటూ సమస్యలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజా ధనాన్ని దోచుకున్నారన్నారు.

పదేళ్ల కాంగ్రెస్ పాలనంతా అవినీతి, అక్రమాలతోనే సాగిందని, రాష్ట్రం ఇప్పుడు పడుతున్న కష్టాలకు ఆ పార్టీ విధానాలే కారణమన్నారు. వారి హయాంలో సాగుకు ఎప్పుడు విద్యుత్ వచ్చేదో తెలిసేది కాదని, వేసవి వస్తే అసలు కరెంటే ఉండేది కాదన్నారు.
విభజనలో నష్టపోయిన రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకురాత్రింబవళ్లూ కష్టపడుతున్నానని, రాష్ట్రంలో పేదరికాన్ని తరిమికొట్టాలన్నదే తన ధ్యేయం అన్నారు. హైదరాబాద్లో పదేళ్లు ఉండే అవకాశం ఉన్నా అమరావతి నుంచి పాలన సాగిస్తున్నామన్నారు.
ప్రజల ప్రగతే ధ్యేయంగా దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకున్నామని, ప్రతి ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చానని, ఆ మాట నిలబెట్టుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నానన్నారు. 2019 నాటికి అభివృద్ధిలో దేశంలోనే 3వ రాష్ట్రంగా, 2029 నాటికి అగ్రరాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.












Click it and Unblock the Notifications