పవన్ కళ్యాణ్ మాతో వస్తే జగన్కు నొప్పి ఏమిటి?: చంద్రబాబు సంచలనం, జనసేనకు టీడీపీ ఆహ్వానం!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం చివరి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఆయన గత కొద్దిరోజులుగా వీటిని విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే. అమరావతిలో ప్రజావేదికలో పదో వైట్ పేపర్ విడుదల చేశారు. అనంతరం ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు.
ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు గత కొన్నాళ్లుగా చెబుతున్నారు. దీనిపై విలేకరులు ప్రశ్నించారు.

మేం కలిసి పోటీ చేస్తే జగన్కు వచ్చిన ఇబ్బందేమిటి?
పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో ఉన్నారా అని మీడియా ప్రతినిధులు అడిగారు. దానికి చంద్రబాబు స్పందిస్తూ... టీడీపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తే జగన్కు వచ్చిన నొప్పి ఏమిటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తమతో కలిసి పోటీ చేస్తారా లేదా అనే అంశంపై నేను మాట్లాడనని చెప్పారు.

అసలు జగన్ ఎవరితో ఉన్నారు?
అసలు తొలుత జగన్ భారతీయ జనతా పార్టీతో (బీజేపీ) కలిసి ఉన్నారో లేదో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అక్కడక్కడ తనను కూడా విమర్శిస్తూనే ఉన్నారని చెప్పారు. అలా అని ఊహాజనిత అంశాలపై తాను స్పందించనని చెప్పారు. తద్వారా పవన్ కళ్యాణ్ తమతో ఉన్నారనే వాదనను ఆయన కొట్టిపారేశారు.

పవన్ కళ్యాణ్ను జగన్ ఇటీవలే తిడుతున్నారు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో తమతో రాకూడదనే ఉద్దేశ్యంతోనే జగన్ తిడుతున్నారని చెప్పారు. జగన్ ఇటీవలి కాలంలోనే జనసేనానిని తిడుతున్నారని చెప్పారు. ఎందుకంటే ఆయన మాతో రాకూడదనేది ఆయన ప్రయత్నమని చెప్పారు. బీజేపీపై పోరాటం చేసేందుకు పవన్ కళ్యాణ్ తమతో కలిసి రావాలని కోరుతున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications