సీఎంగా యోగి: సుజన, కేశినేని నానిలతో కలిసి బయలుదేరిన చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో బయలుదేరి వెళ్లారు. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
అమరావతి/లక్నో: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో బయలుదేరి వెళ్లారు. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
గ్రాడ్యుయేట్ నుంచి సన్యాసి.. ఇప్పుడు సీఎంగా యోగి ఆదిత్యనాథ్
ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందడంతో చంద్రబాబు అక్కడికి బయలుదేరారు. ఆయన వెంట కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ తదితరులు వెళ్లారు.
ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పలువురు కేంద్రమంత్రులు, నేతలు హాజరుకానున్నారు.
కాగా, ఎమ్మెల్యేల ఆమోదం మేరకు యూపీ ముఖ్యమంత్రిగా ఎంపీ యోగి ఆదిత్యనాథ్ను ఎన్నుకున్నామని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు శనివారం తెలిపారు. కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మను ఉప ముఖ్యమంత్రులుగా నియమించాలని నిర్ణయించారు.
వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ విధి విధానాల మేరకే యోగి ఆదిత్యనాథ్ పేరు తెరపైకి వచ్చిందన్నారు. శాసనసభాపక్ష సమావేశంలో ఆయన సీఎం అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్థించారని తెలిపారు. యోగికి మద్దతుగా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కావాలని ఎమ్మెల్యేలు కోరడంతో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామన్నారు.