జగన్ది దిక్కులేని పార్టీ, నన్ను అవహేళన చేశారు: నవ్వులు పూయించిన బాబు
హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించినప్పుడు అందరూ ఎగతాళి చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.
విశాఖపట్టణం: హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించినప్పుడు అందరూ ఎగతాళి చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నేడు అదే హైటెక్ సిటీ తెలుగువారి జీవితాల్లో వెలుగునింపిందన్నారు. విశాఖలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన ప్రసంగించారు.
మేం చేసిన అభివృద్ధే..
హైదరాబాద్లో ఇప్పుడు ఐటీ వల్ల ఎంతోమంది తెలుగువారు ఉపాధి పొందుతున్నారన్నారు. అలాగే హైదరాబాద్లో అధిక ఆదాయం రావడానికి కారణం గతంలో టీడీపీ చేసిన అభివృద్ధేనని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో దేవాదుల, నెట్టంపాడు, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు.
దశ దిశలేని జగన్ పార్టీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దశ దిశ లేని పార్టీ అని సీఎం చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో, బయట అల్లరిచేయడమే వైసీపీ నేతల పని అని చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలు వైసీపీ నేతలకు ఏమాత్రం పట్టవన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా దిక్కులేదని అన్నారు.
వేరేవారికి ఓటెలా వేస్తారు?
అలాగే 2018నాటికి కృష్ణా డెల్టాకు, విశాఖకు గ్రావిటీ ద్వారా నీళ్లు అందిస్తామని చంద్రబాబునాయుడు అన్నారు. ప్రభుత్వం చేసిన పనులను పార్టీ కార్యకర్తలు ప్రజలకు చెప్పాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని, మనం అన్ని పనులు చేస్తే వేరే వారికి ఓటెందుకు వేస్తారని ఆయన అన్నారు. అలాగే మనం అన్నిరకాలుగా అండగా ఉంటే మనకే తప్పకుండా ఓటేస్తారని చంద్రబాబు అన్నారు.
కాళ్ల నొప్పులింకా పోలేదు..
‘మీ కోసం' పాదయాత్ర చేపట్టి 2808 కిలోమీటర్ల పాదయాత్రను 200రోజులు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. ఆ కాళ్ల నొప్పులు ఇప్పటికీ పోలేదని అన్నారు. విభజన సమయంలోనూ తాను రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పోరాడానని తెలిపారు. ప్రత్యేక హోదాకు సమానమైన నిధులు ఇస్తామంటేనే తాను ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించినట్లు తెలిపారు. కొందరు విమర్శలు చేయడం తగదని అన్నారు.
ఏ పిల్లి అయితే ఏంటీ?
ఈ రోజు సిద్ధాంత పరమైన రాజకీయాల కంటే పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ‘చైనాలో ఒకప్పుడు కమ్యూనిజం ఉంది. ఆ తర్వాత షియో బెంగ్ వచ్చి ఒక మాట చెప్పారు. ‘ పిల్లి నల్లదా,తెల్లదా, ఎర్రదా అనేది ముఖ్యం కాదు. అది ఎలుకలను సమర్థవంతంగా పట్టగలిగితే.. ఏ పిల్లి అయినా ఫర్వాలేదు' అని ఒక నూతన నిర్వచనం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ దివాళా తీసిన పార్టీ, ఏపీలో కాంగ్రెస్ కు మనుగడ లేదని, భవిష్యత్తులో కూడా ఆ పార్టీని ఎవరూ గౌరవించే పరిస్థితి లేదని అన్నారు.
మహానాడుకు డుమ్మా కొట్టకండి
మహానాడుకు డుమ్మా కొట్టి.. బయటకు పోకండి అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు. ‘ఎండ కూడా లేదు ప్లెజంట్గా ఉంది. బీచ్కు పోవాలనుకుంటే, విశాఖపట్టణం చూడాలనుకుంటే ఉదయం, సాయంత్రం వెళ్లండి.. మిగిలిన సమయంలో ఇక్కడే ఉండండి, మొత్తం స్టడీ చేయండి, సబ్జెక్ట్సన్నీ ఫాలో కండి, మీరు పూర్తిగా భాగస్వాములు కండి. అవసరమైతే, ఇంకా కోరిక ఉంటే, 29వ తేదీ తర్వాత ఒక రోజో రెండు రోజులో ఇక్కడే ఉండి పక్కనే ఉన్న అరకు, బుర్రా కేవ్స్ చూడండి. బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. అరకుకు ప్రత్యేక రైలు కూడా ఉంది.' అని చంద్రబాబు చెప్పడంతో నవ్వులు విరిశాయి.