రెచ్చగొడుతున్నారు, ఎంతవరకైనా వెళ్తాం: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు.
తిరుపతి: పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. నీటి సమస్యకు నదుల అనుసంధానమే పరిష్కారమని చెప్పారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో నీటి వివాదాలున్నాయని అన్నారు. ఆయన మంగళవారు తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.
పట్టిసీమపై రైతులను కొందరు రెచ్చగొడుతున్నారని, వారి పాచికపారలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.

ప్రజలకు అన్యాయం చేయాలని ఎవరు చూసినా ఊరుకునేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడం ఖాయమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల కోసం ఎంతవరకైనా వెళ్తామని స్పష్టం చేశారు.
పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణం అడ్డుకోవడానికి విపక్షాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. పోలవరానికి పర్యావరణ అనుమతులపై ఎన్జీటికి వెళ్లినట్లు తెలిపారు. పోలవరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తుందని చంద్రబాబు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు దేశానికి గర్వకారణమని.. భవిష్యత్తుల్లో ఇలాంటి ప్రాజెక్టు మరొకటి నిర్మించే అవకాశం కూడా లేదన్నారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై నిత్యం బురద జల్లుతూ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications