Rs.2వేలతో అరటిపళ్లు కొన్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రూ.2వేలు వెచ్చించి అరటిపళ్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయన ఉమ్మడి విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజాం నుంచి బొబ్బిలి వెళ్లే రహదారిలో అరటిపండ్లు అమ్ముకునే వ్యక్తితో కొంచెంసేపు ముచ్చటించారు. ఆ వ్యక్తి దగ్గర రూ.2వేలతో అరటిపళ్లు కొని అక్కడున్న చిన్న పిల్లలకు, స్థానికులకు పంచారు. తర్వాత బాడంగి మండలం రేజేరులో బెల్లం బట్టీని పరిశీలించారు.
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబునాయుడు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ.. లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అన్నింటిపై పన్నులు వేసి ఎలా వసూలు చేస్తుందో తెలియజేసేందుకు బాదుడే బాదుడు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లోపించిందంటూ ప్రచారం చేసేందుకు ఇదేం ఖర్మను రూపొందించారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన ప్రణాళికలు రూపొందించడంతోపాటు జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు.

ఆయన తనయుడు లోకేష్ జనవరి 27 నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. 4వేల కిలోమీటర్లు ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకున్నారు. మరోవైపు అధికార ప్రభుత్వం విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది. ఇక్కడి నుంచి పరిపాలన సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇటువంటి పరిణామాల మధ్య మూడు జిల్లాల ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.












Click it and Unblock the Notifications