ఓటుకు నోటు కేసుపై చంద్రబాబు ఇలా: జగన్పై తీవ్ర వ్యాఖ్యలు
కర్నూలు: ఓటుకు నోటు కేసు విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. శనివారం కర్నూలులో జరిగన జనచైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు.
ఓటుకు నోటు కేసులో తాను ఎవరికి డబ్బు ఇచ్చానో చెప్పాలని ఆయన వైయస్ జగన్ను డిమాండ్ చేశారు. తన అనుభవంత వయస్సు జగన్కు లేదని వ్యాఖ్యానించారు. కేంద్రంతో రాజీ పడ్డానని వైయస్ జగన్ అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆయన అన్నారు. తాను ఎవరితోనూ రాజీ పడలేదని అన్నారు.
కర్నూలు నగరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. నగరానికి చేరుకున్న సీఎం కిడ్స్ వరల్డ్ సమీపంలో అమృత్ పథకం కింద చేపట్టనున్న మంచినీటి పథకానికి, రూ.15కోట్లతో చేపట్టనున్న విజయవనానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం కిడ్స్ వరల్డ్ నుంచి తెదేపా జనచైతన్యయాత్రలో భాగంగా పాదయాత్ర ప్రారంభించారు. మంత్రి అచ్చెన్నాయుడు, రాజ్యసభ సభ్యుడు టి.జి వెంకటేశ్, పలువురు తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.