మహిళలను వేధిస్తే, కఠిన చర్యలు తప్పవు: బాబు
నెల్లూరు: రాష్ట్రంలో ఆడపిల్లలపై వేధింపులు జరగకూడదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అత్యాచారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళలను వేధిస్తే ఊరుకునేది లేదని సీఎం స్పష్టం చేశారు.
నెల్లూరులో మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సింహపురి మహిళలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని ప్రశంసించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా చేయూతనిస్తామన్నారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు ప్రయత్నించాలని, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.
డ్వాక్రా సంఘాల అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. డ్వాక్రా సంఘాలు క్రమశిక్షణతో పనిచేస్తున్నాయని ఆయన ప్రశంసించారు. డ్వాక్రా సంఘాలను ఆదుకునేందుకు మహిళా సాధికార సంస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళా సంఘాలకు ఇసుక రీచ్ల బాధ్యత అప్పగించామని, ధాన్యం సేకరణ బాధ్యత కూడా మహిళలకే అప్పగించామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఇక గర్బిణీ స్ర్తీలకు పౌష్టికాహారం అందిస్తామన్నారు. వయోజన విద్య ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతామన్న ముఖ్యమంత్రి వ్యాపార రంగంలో మహిళలకు మెలకువలు నేర్పిస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలు, అంగన్ వాడీలు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ను ఓ ఉద్యమంలా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని డ్వాక్రా సంఘాలే ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణించిన మహిళా ప్రముఖులను సీఎం సన్మానించారు. ఏపీ సభాపతి కోడెల శివప్రసాద రావు, మంత్రులు నారాయణ, మృణాళిని, పీతల సుజాత, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, గాయని సునీత తదితరులు పాల్గొన్నారు.