రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నావ్: మహిళతో బాబు, నవ్వించారు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు విజయవాడలో అక్షరాస్యత దినోత్సవంలో పాల్గొన్న వారిని నవ్వించారు. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన పలువురితో ముచ్చటించారు. ఓ మహిళతో మాట్లాడుతూ... నీ భర్త కంటే నీవు ఎక్కువగా సంపాదిస్తున్నావని, అలాగే చదువుకున్నావని.. కాబట్టి నీకు నీ భర్త, ఇతర గ్రామస్తులు మంచి విలువ ఇస్తున్నారు కదా అని ప్రశ్నించారు.
దానికి ఆమె కావొచ్చు అని అంది. దాంతో, చంద్రబాబు రాజకీయ నాయకుల వలె మాట్లాడుతున్నావని నవ్వులు పూయించారు. నీవు చదువుకున్నావని, నీ భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నావని అందుకే ఇంత గౌరవం అని చంద్రబాబు చెప్పారు.
అనంతరం చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడారు. అక్షరాస్యతలో మనం 31వ స్థానంలో ఉన్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ పాలనలో 17 శాతం అక్షరాస్యత సాధించామని, కానీ గత పదేళ్ల కాంగ్రెస్ కాలంలో కేవలం 6.5 శాతం మాత్రమే పెరిగిందన్నారు.
ప్రపంచ నిరక్షరాస్యుల్లో భారత దేశంలోనే 50 శాతం మంది ఉన్నారన్నారు. అక్షరాస్యతతో ఆత్మస్థైర్యం, ప్రపంచ జ్ఞానం పెరుగుతాయన్నారు. డ్వాక్రా సంఘాలు సంఘటిత శక్తిగా ఎదగాలన్నారు. ప్రపంచంలో పలు అత్యున్నత కంపెనీలకు భారతీయులు, తెలుగు వారు సీఈవోలుగా ఉన్నారని చెప్పారు.