చంద్రబాబు-పవన్ మైండ్ గేమ్ అట్టర్ ఫ్లాప్ ! ట్రాప్ లో పడని బీజేపీ- వైసీపీ హ్యాపీ!
ఏపీలో అధికార వైసీపీని గద్దె దించే లక్ష్యంతో ఉమ్మడి విపక్షం ఏర్పాటుకు ప్రయత్నించిన విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హఠాత్తుగా తమ ప్రణాళికల్నివాయిదా వేసుకున్నారు. బీజేపీని కలుపుకుని ఉమ్మడి విపక్షంగా ఏర్పడేందుకు ప్రయత్నించిన చంద్రబాబు-పవన్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. దాదాపు వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాన్ని తమ వ్యాఖ్యలతో ఎంత వేడెక్కించినా కాషాయ శిబిరం నుంచి స్పందన లేకపోవడంతో వీరి ప్రయత్నాలు అనివార్యంగా వాయిదా పడ్డాయి.
పవన్ ఉమ్మడి విపక్షం ప్లాన్
ఏపీలో దుర్భేద్యంగా కనిపిస్తున్న అధికార వైసీపీని ఢీకొట్టాలంటే విపక్షాలన్నీ ఉమ్మడిగా పోరాడక తప్పదనే అంచనాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చేశారు. దీంతో తమ మాజీ మిత్రపక్షం టీడీపీతో పాటు ప్రస్తుత మిత్రపక్షం బీజేపీని కూడా కలుపుకుని ముందుకు వెళ్లేందుకు వీలుగా పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని ప్రకటించారు. కానీ అదంత సులువు కాదని ఆయనకూ తెలుసు. అయినా ఓ ప్రయత్నం చేద్దామనుకుని మైండ్ గేమ్ మొదలుపెట్టారు.
మాట కలిపిన చంద్రబాబు
పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఉమ్మడి విపక్షం ఆఫర్ కు చంద్రబాబు స్పందించారు. అవసరమైతే ఎవరితోనైనా పొత్తు పెట్టుకునేందుకు సిద్దమంటూ ముందుకొచ్చారు. పవన్ గురించి పరోక్ష వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. దీంతో పవన్ తో పాటు కలిసి ఉన్న బీజేపీ కూడా ముందుకొస్తుందని ఊహించారు. గతంలో పలుమార్లు బీజేపీతో కలిసి పనిచేసిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో అదే పార్టీపై పోరాటం చేశారు. అయినా మరోసారి బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న చంద్రబాబు పొత్తులపై సీరియస్ వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. దీంతో పవన్ కూడా వీటికి స్పందిస్తూ పొత్తుల వేడి రగిలేలా చేసారు.
ట్రాప్ లో పడని బీజేపీ
చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రతిపక్షం కోసం చేస్తున్న ప్రయత్నాలకు బీజేపీ మాత్రం తలొగ్గలేదు. పవన్ కళ్యాణ్ తో ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ.. ఇప్పుడు ఆ కూటమిలో చంద్రబాబును కూడా చేర్చుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు సైతం వైసీపీ, టీడీపీ ఇద్దరికీ సమాన దూరం పాటించాలన్న సంకేతాలు ఇవ్వడంతో ఆ మేరకు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా చంద్రబాబు-పవన్ వ్యూహాలకు సహకరించలేదు. పవన్ తో పొత్తు కొనసాగుతున్నంత సేపు ఇతర పార్టీలతో పొత్తులు ఉండబోవని బీజేపీ నేతలు తేల్చిచెప్పేశారు. దీంతో చంద్రబాబు-పవన్ వ్యూహాలకు బ్రేక్ పడినట్లయింది.
పొత్తుల వ్యూహాలకు బ్రేక్
బీజేపీని తాము ప్రతిపాదిస్తున్న కూటమిలోకి లాగేందుకు మైండ్ గేమ్ ప్రారంభించిన చంద్రబాబు-పవన్ అది కాస్తా వర్కవుట్ కాకపోవడంతో తమ వ్యూహాలకు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన చంద్రబాబు.. పొత్తులపై ఇప్పుడే చర్చలు అవసరం లేదన్నారు. దీంతో పొత్తుల వ్యూహాలపై కాస్త విరామం ఇచ్చి మళ్లీ దీనిపై వర్కవుట్ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఎన్నికలపై క్లారిటీ వచ్చాక మరోసారి పొత్తుల చర్చలు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం అంతిమంగా వైసీపీ శిబిరంలో ఉత్సాహం నింపింది. చంద్రబాబు-పవన్ పొత్తుల వ్యాఖ్యలు మొదలుపెట్టగానే తీవ్రంగా స్పందించిన వైసీపీ ఇప్పుడు తిరిగి మౌనం వహించడమే ఇందుకు నిదర్శనం.