చంద్రబాబు, పవన్ పొంచి ఉన్నారు-వరదలపై బీ అలర్ట్-జగన్ హెచ్చరికలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికీ, విపక్షాలైన టీడీపీ, జనసేనకు మధ్య నెలకొన్న రాజకీయ వైరం.. గోదావరి వరదల విషయంలోనూ కనిపిస్తోంది. ఇప్పటికే గోదావరి వరదలపై ప్రభుత్వం సన్నద్ధంగా లేదంటూ విపక్షాలు విమర్శలు చేస్తూన్న ఉన్నాయి. అలాగే గోదావరి జిల్లాల్లో లంకలన్నీ ముంపులోకి జారుకున్నాయి. దీంతో విపక్షాలతో పాటు మీడియాకూడా విమర్శలు చేసే ప్రమాదం పొంచి ఉందని, కాబట్టి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని జగన్ అధికారులకు ఇవాళ హెచ్చరికలు జారీ చేశారు.
గోదావరి వరదలపై జగన్ సమీక్ష
రాష్ట్రంలో గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయం నుంచి సీఎం వైయస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందులో 6 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం మాట్లాడారు. గోదావరి వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోందని, అయితే వర్షాల కారణంగా ఇబ్బందులు తప్పడం లేదని ఆయన తెలిపారు. కాబట్టి నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
బాధితుల్ని ఆదుకోవడంపై
వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోందని, సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాల్సి ఉందని సీఎం జగన్ అధికారులకు సూచించారు. సీయర్ అధికారులు, కలెక్టర్ల భుజాలమీద ఈ బాధ్యత ఉందన్నారు. రానున్న 48 గంటల్లో ఏ ఇల్లుకూడా మిగిలిపోకుండా రూ.2వేల సహాయం అందాలన్నారు. అలాగే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్తో కూడిన రేషన్ పంపిణీ జరగాలని సీఎం సూచించారు. ఈ రేషన్ వదర బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలని జగన్ ఆదేశించారు. ముంపుకు గురైన ప్రతి గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలన్నారు.
వాలంటీర్లు, సచివాలయాలసాయం
కలెక్టర్లు, సీనియర్ అధికారులు వరద పరిస్ధితుల్ని సవాల్ గా తీసుకోవాలని జగన్ సూచించారు. గతంలో రెండు జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు మాత్రమే ఉండేవారని, ఇద్దరు జాయింట్కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు మాత్రమే ఉండేవారని, ప్రస్తుతం కాకినాడతో కలుపుకుని ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలు ఉన్నారని జగన్ తెలిపారు.గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ కూడా మీకు అందుబాటులో ఉందన్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉన్నారని, ప్రతి 50 ఇళ్లకూ ఒక వాలంటీర్ ఉన్నారని గుర్తుచేశారు. ఇలాంటి వ్యవస్థకు ఇప్పుడు మీకు అందుబాటులో ఉందని, నాణ్యమైన సేవలు అందించాలని కోరారు.
చంద్రబాబు, పవన్ ఉన్నారు జాగ్రత్త
గతంలో ఎప్పుడూ కూడా వరద బాధితులకు రూ.2వేల ఆర్థిక సహాయం చేయలేదని జగన్ గుర్తుచేశారు. విరామం ఎరుగకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నామన్నారు. అలాంటి వారిలో నైతిక స్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. చంద్రబాబు, ఈనాడు, టీవీ-5, ఆంధ్రజ్యోతి, పవన్కళ్యాణ్ వంటివారు బురదజల్లుతున్నారని జగన్ గుర్తుచేశారు.
వీరంతా రాష్ట్రం ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికి ఇలాంటి ప్రచారాలు వారు చేస్తారన్నారు.
బురదజల్లడానికి నానారకాలుగా ప్రయత్నిస్తున్నారని జగన్ ఆక్షేపించారు. మీరు మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదన్నారు. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలన్నారు. దురుద్దేశ పూర్వకంగా చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. వదంతులను కూడా తిప్పికొట్టాలన్నారు.