రుణమాఫీపై బాబు ముందడుగు: లేఖపై జానా ఆగ్రహం
హైదరాబాద్: రుణమాఫీపై అభ్యంతరాలు తెలుపుతూ ఆర్బీఐ జారీ చేసిన నోటీసులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్తో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని ఆయనకు చంద్రబాబు వివరించారు.
ప్రకృతి వైపరీత్యాలు, పెరిగిన విత్తన ధరలు, ఎరువుల ధరల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆయనకుచెప్పారు. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయాన్ని గట్టెక్కించేందుకే తాము రుణమాఫీ ప్రకటించామని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు ఆర్బీఐ కూడా తమకు సహకరించాలని కోరారు.

కాగా, పంట రుణాల మాఫీ విషయమై కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలకు లేఖలు రాయాలని చంద్రబాబు సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంగళవారం నిర్ణయించారు. వరదలు, తుపానులు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఎరువుల ధరల పెరుగుదల తదితర కారణాల వల్ల రైతు నష్టపోయాడని, అందుకే రుణాల ఊబిలో కూరుకున్నాడని లేఖలో వివరించాలని భావించారు.
చంద్రబాబుపై జానారెడ్డి అసహనం
తెలంగాణ ప్రభుత్వానికి తాము అన్నిరకాలుగా సహకరిస్తామని తెలంగాణ రాష్ట్ర శాసన శభా పక్ష నేత జానా రెడ్డి అన్నారు. మరోవైపు చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలు విద్యుత్ను చట్టపరంగా ఉపయోగించుకోవాలన్నారు. కేంద్రం మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని చంద్రబాబు ఈసీకి ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించారు. అవసరమైతే ఈఆర్సీకి వెళ్తామని, కేంద్రం జోక్యం కోరుతామన్నారు. విభజన చట్టంలోనే పిఏసిల ప్రస్తావన స్పష్టంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications