చంద్రబాబు భారీ ప్లాన్ ఖరారు-ఒంగోల్లో మహానాడు-ఏడాదిపాటు జనంలోనే-జగన్ ఫ్రస్ట్రేషన్ అదే
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. జగన్ తన కేబినెట్ ను తాజాగా ప్రక్షాళన చేశారు. దీనిపై వైసీపీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు ఎన్నికలకు రెండేళ్లే మిగిలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో వైసీపీ సర్కార్ పై అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు ప్రధాన విపక్షం టీడీపీ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది పాటు పూర్తిగా ప్రజల్లో ఉండటంతో పాటు భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై చంద్రబాబు ఇవాళ మీడియాతో చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు చిట్ చాట్
ఏపీలో వైసీపీ పాలనా వైఫల్యాల నేపథ్యంలో నెలకొన్న పరిస్ధితులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో టీడీపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా జగన్ సర్కార్ వ్యవహారశైలిపై చంద్రబాబు చేసిన కామెంట్స్ పై చర్చ జరుగుతోంది.
ఎన్నడూ లేనంత వ్యతిరేకత
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వంపై ఈ స్థాయి ప్రజా వ్యతిరేకత చరిత్రలో చూడలేదన్నారు. ప్రభుత్వాలు విఫలం అవ్వడం వేరు...పాలనపై ఈ స్థాయి అసంతృప్తి వేరని చంద్రబాబు తెలిపారు. టిడిపి అత్యధిక సీట్లు గెలిచిన 1994లో కూడా ప్రజల్లో నాటి ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత లేదన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.
పథకాల వెనుక లూటీ జనం గుర్తించారు
జగన్ పథకాల వెనుక ఉన్న లూటీని ప్రజలు గుర్తించారని చంద్రబాబు తెలిపారు. తాము ఏం నష్టపోయామో వారికి తెలుస్తోందన్నారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సంక్షేమ పథకాలు కారణం కాదని, జగన్ లూటీ వల్లనే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను దెబ్బతీసి జగన్ తన ఆదాయం పెంచుకుంటున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మద్యం పై బహిరంగ దోపిడీ జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వ్యక్తుల జేబులోకి వెళుతుందన్నారు. మైనింగ్, ఇసుక ను సంపూర్ణంగా దోచుకుంటున్నారని, ఈ భారం ప్రజపైనే పడుతుందన్నారు. రైతు వర్గంలో ఒక్క ఓటు కూడా ఇక వైసీపీకి పడే చాన్స్ లేదని చంద్రబాబు విశ్లేషించారు. రైతులకు ఏడాదికి 7 వేలు ఇచ్చి...ఇతరత్రా వారిని పూర్తిగా విస్మరించారని గుర్తుచేశారు.
సామాజిక వర్గాల టార్గెట్
రాజకీయాల్లో వర్గ ద్వేషాలు ఉండకూడదని, కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకోవడం ఎప్పుడూ చూడలేదని జగన్ పాలనపై చంద్రబాబు వ్యాఖ్యానించారు. పవన్ పై కోపంతో ఒక సామాజికవర్గాన్ని, టిడిపిపై కోపంతో మరో వర్గాన్ని, రఘరామకృష్ణం రాజుపై కోపంతో మరో వర్గాన్ని టార్గెట్ చేశారని చంద్రబాబు తెలిపారు. జగన్ లో అపరిచితుడు ఉన్నాడని, జగన్ చెప్పే వాటికి చేసే వాటికి సంబంధం ఉండదన్నారు.
జగన్ ఫ్రస్ట్రేషన్ అదే
వైసీపీ ఇప్పుడు ఓడిపోతే మళ్లీ జీవితంలో అధికారంలోకి రాదనేదే జగన్ ఫ్రస్టేషన్ కు కారణమని చంద్రబాబు తెలిపారు.
జగన్ ఫ్రస్టేషన్ లోనే అతని భాషమారిందని చంద్రబాబు తెలిపారు. క్యాబినెట్ విస్తరణ తో జగన్ బలహీనుడు అని తేలిపోయిందన్నారు. ఒత్తిళ్లతో సగంమందిని క్యాబినెట్ లో తిరిగి కొనసాగించారని, దీంతో బయట తిరుగుబాట్లు మొదలయ్యాయన్నారు. క్యాబినెట్ విస్తరణ అనంతరం బ్రతిమిలాడుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రాలేదన్నారు. భవనం వెంకట్రామ్ కు కూడా ఇంత బలహీనంగా కనిపించలేదన్నారు. తన ఇంటి మీద దాడికి వచ్చిన వారికి, లోకేష్ ను దూషించిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. మంత్రి పదవులు పొందడానికి ఇదేనా అర్హత అని ప్రశ్నించారు.
మహానాడు ఒంగోల్లో మహానాడు-ఏడాది ప్రజల్లోనే
ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. బాదుడే బాదుడు పేరుతో టిడిపి చేస్తున్న పోరాటంలోనూ పాల్గొంటానని చంద్రబాబు వెల్లడించారు. మహానాడు వరకు బాదుడే బాదుడు కార్యక్రమం ఉంటుందన్నారు. మే మొదటి వారం నుంచి తన పర్యటనలు మొదలు అవుతాయని చంద్రబాబు తెలిపారు. మహానాడు తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్త్రృతంగా పర్యటనలు చేపడతానని వెల్లడించారు. నెలకు రెండు జిల్లాల చొప్పున ఏడాదిలో అన్ని జిల్లాల పర్యటన పూర్తి చేస్తానన్నారు. ఈ ఏడాది ఒంగోలులో మహానాడు నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.