కూలి నెం.1 బాబు: పవన్కి ప్రశంస, అందుకే వివేక్ రాక
విజయవాడ/గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశించి ఆదివారం రాత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులను గుర్తు చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా... తన వల్ల ఓట్లు డివైడ్ కావొద్దని, కాంగ్రెసు పోవాలని, దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు రావాలని, ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా టిడిపి, బిజెపి కూటమికి మద్దతిచ్చారని చెప్పారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఓ చిత్రంలో పరిటాల రవి పాత్ర పోషించిన విషయాన్ని తాను ఢిల్లీ వెళ్లినప్పుడు గుర్తుకు చేశారన్నారు.
హత్యగావింపబడ్డ పరిటాల రవి సతీమణి పరిటాల సునీతకు తాను మంత్రి పదవి ఇస్తున్నానని, ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించానని, ఆయన మంచి మనసుతో వచ్చారని చెప్పారు. పరిటాల సునీతకు ఆయన అభినందనలు తెలిపారన్నారు.

నాలో కసి ఉంది
ఇంత ఆర్భాటంగా ప్రమాణ స్వీకారం చేయడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారని, కానీ ఎపిలో అభద్రతా భావం పోగొట్టేందుకే తాను ఇలా ప్రమాణం చేశానన్నారు. జాతీయస్థాయి నేతలను హామీ పొందేందుకే ఈ ప్రమాణం అన్నారు. మనం కసిగా పని చేద్దామన్నారు. నాలో కసి ఉందన్నారు. రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తానన్నారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావాలని అందరు ఆకాంక్షించారని, పూజలు చేశారన్నారు. ఈ విజయం తెలుగు ప్రజలందరిదీ అన్నారు. కార్యకర్తలది అన్నారు.
కార్యకర్తలు చేసిన కృషి మరువలేదని, వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రానికి ఉన్న ఆదాయం, అప్పులు తెలియని పరిస్థితి ఉందన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ను మరువలేమన్నారు. ఎన్టీఆర్ యుగపురుషుడు అన్నారు. ఎపి, తెలంగాణలోనే కాదు.. దేశంలోనే కాంగ్రెస్ పోయిందన్నారు.
నెంబర్ వన్ కూలిగా ఉంటా
రాజధాని కట్టే వరకు తాను నెంబర్ వన్ కూలీగా ఉంటానని చంద్రబాబు చెప్పారు. వెంకయ్య నాయుడు చొరవతో పోలవరం ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేరుస్తారన్నారు.
కట్టుబట్టలతో...
రాజధాని ఏదో తెలియకుండా, కట్టుబట్టలతో మనల్ని పంపించేలా కాంగ్రెసు పార్టీ కుట్ర చేసిందన్నారు. మనకు తీరప్రాంతం ఉందని, పన్నెండు, పదమూడు పోర్టులు ఉన్నాయని, దేశానికి అన్నం ఈ ప్రాంతం పెట్టిందని, విద్యావంతులు ఉన్నారని.. ఇలాంటి వారితో అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజల్లో కోపం ఉంది, ఆగ్రహం ఉంది, దానిని కసిగా మార్చుకుందామన్నారు. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చుకుంటామని చెప్పారు. నిండు మనస్సుతో అందరు సహకరించాలని కోరారు. కేంద్రంలో ఉన్న ఎన్డీయే తనకు పూర్తిగా సహకరిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications