పెరుగుతున్న దాడి: సోము వీర్రాజు వెనక ఎవరు, ఒత్తిడిలో చంద్రబాబు?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, బిజెపిల మధ్య దూరం మరింత పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బిజెపి నాయకులు విమర్శల దాడిని పెంచుతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒత్తిడికి గురవుతున్నారని అంటున్నారు. బిజెపి నేతల విమర్శలపై సంయమనం పాటించాలని తన పార్టీ నాయకులకు చంద్రబాబు చెప్పినప్పటికీ ఫలితం ఉండడం లేదు.
బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మినారాయణ, పురంధేశ్వరిలపై టిడిపి నేతలు విరుచుకుపడుతూనే ఉన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలుగుదేశం ప్రభుత్వంపై మొదటి నుంచి వ్యతిరేకతతో ఉన్నారని అంటున్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రజలు అందరూ సంతోషం వ్యక్తం చేస్తే వీర్రాజు ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని ఆరోపణలు చేశారు.

సోము వీర్రాజు సమయం చిక్కినప్పుడల్లా టీడీపీపై ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు. ఇలా వీర్రాజు విమర్శలు చేయడం వెనుక బిజెపి పెద్దలు ఎవరైనా ఉన్నారా అనే సందేహంలో టిడిపి నేతలు పడ్డారు. అయితే బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరూ వీర్రాజు వ్యాఖ్యలను ఖండించడం లేదు. అయితే, ఇప్పుడు ఆయనకు కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మినారాయణ, పురంధేశ్వరి వంటి నాయకులు తోడయ్యారు.
తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ప్రతి దాడి మొదలైంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కొద్ది రోజులుగా తమపై విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులపై తీవ్ర విమర్శలకు దిగారు. ఎమ్మెల్సీలు బాబూ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, గాలి ముద్దుకృష్ణమనాయుడు వంటి నేతలు బీజేపీ నాయకుడు సోము వీర్రాజుతో పాటు కావూరి, కన్నా లక్ష్మినారాయణలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కార్యదర్శి, ఎమ్మెల్యే బొండా ఉమా కూడా తాజాగా రంగంలోకి దిగారు.
తెలుగుదేశం పార్టీ కూడా బిజెపి వైఖరితో ఇరకాటంలో ఉంది. అయినప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీ ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసిన సహాయ సహకారాలను, ఇచ్చిన సంస్థలను పదే పదే వల్లెవేస్తూ ప్రధాని మోడీపై విమర్శలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయినా బిజెపి నాయకుల విమర్శలతో టిడిపిలో అసహనం పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications