చంద్రబాబు చాన్నాళ్ల తరువాత తీరిగ్గా.. ఒత్తిళ్లకు దూరంగా! భార్యతో కలసి కాఫీ షాప్లో..
Recommended Video
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలాకాలం తరువాత తీరిగ్గా కనిపించారు. ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా గడిపిన ఆయన ఇక రాజకీయపరమైన ఒత్తిళ్లకు దూరంగా ఉంటున్నారు. కుటుంబంతో గడపడానికి ఇష్టపడుతున్నారు. ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడానికి తన భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ కాఫీ షాప్ లో చంద్రబాబు భార్యతో కలిసి కాఫీని సిప్ చేస్తూ కనిపించారు. ఆ విమానాశ్రయం ఎక్కడ అనేది స్పష్టంగా తెలియరానప్పటికీ.. న్యూయార్క్ అని అంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పదిరోజుల పాటు చంద్రబాబు అమెరికాలో ఉంటారు. తన పర్యటన సందర్భంగా చంద్రబాబు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ప్రతినిధులతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కౌంటర్ అటాక్ అందుకే చేయలేకపోయారా?
చంద్రబాబు నాయుడికి వయసు మీద పడటంతో ఆయన మునుపటిలా చురుగ్గా ఉండట్లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా పార్టీ అంచనాకు మించిన ఘోర పరాజయాన్ని చవి చూడటం ఆయనను మరింత ఒత్తిడిలోకి నెట్టిందని అంటున్నారు. దీనికితోడు ఆరోగ్యం కూడా పెద్దగా సహకరించట్లేదని అంటున్నారు. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేస్తోన్న దాడులకు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు సరైన ఎదురుదాడి చేయలేకపోయారని చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల పరాజయం అనంతరం చంద్రబాబు నాయుడిలో ఓ రకమైన నిస్పృహ అలముకుందని పార్టీ నాయకులు, సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఫలితంగా కొద్దిగా ఆందోళనకు గురవుతున్నారని అంటున్నారు. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనయ్యారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికా వెళ్లి హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారని పార్టీ నాయకులు అంటున్నారు.

ఘోర పరాజయం తరువాత చంద్రబాబులో ఫైర్ తగ్గిందా?
మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. 175 స్థానాలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ దక్కింది కేవలం 23 సీట్లే. 25 లోక్ సభ స్థానాల్లో టీడీపికి దక్కినవి ముచ్చటగా మూడు. ఓటమి తప్పదని తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రహించినప్పటికీ.. ఇంత దారుణ పరాజయాన్ని మాత్రం ఏ మాత్రం ఊహించలేకపోయారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు సైతం బాహటంగానే అంగీకరించిన విషయం తెలిసిందే. ప్రజల్లో తమ పార్టీపై ఇంత వ్యతిరేకత ఉందా? అంటూ చంద్రబాబే స్వయంగా వ్యాఖ్యానించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ ఓటమి చంద్రబాబును ఓ రకంగా ఆత్మరక్షణలోకి నెట్టింది. నిరాశా, నిస్పృహలకు గురి చేసింది.

ప్రతిపక్ష నేత వద్దన్నది అందుకేనట
చంద్రబాబు నాయుడు ఈ ఓటమిని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారనే విషయం అసెంబ్లీ సమావేశాల ఆరంభంలోనే స్పష్టమైంది. ప్రతిపక్ష నేత పదవి తనకు వద్దని మొదట్లోనే తిరస్కరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చంద్రబాబు ఈ హోదాను పొందారు. ప్రస్తుతం శాసనసభకు ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ల సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, రామకృష్ణ బాబు వంటి కొందరికి మాత్రమే అసెంబ్లీకి ఎన్నికైన అనుభవం ఉంది. చంద్రబాబుతో సమానంగా అనుభవం ఉన్న నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రమే. ప్రతిపక్ష పదవి తనకు వద్దని బుచ్చయ్య చౌదరి తేల్చి చెప్పారు. ఫలితంగా- తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాల్సి వచ్చింది. సభలో పార్టీని ముందుండి నడిపించాల్సి వచ్చింది.

తప్పులను ఎత్తి చూపిన వైఎస్ జగన్
చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్న ప్రతి తప్పునూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా ఎత్తి చూపగలిగారు. దీనికోసం ఆయన శాసన సభలో ఏకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇవ్వడం ప్రతిపక్ష సభ్యులను నోరెత్తకుండా చేసింది. చంద్రబాబు సైతం ఎదురుదాడికి దిగలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. తన ప్రభుత్వ హయాంలో చేసింది తప్పే అని చంద్రబాబు అంగీకరించలేని పరిస్థితిని కల్పించడంలో వైఎస్ జగన్ ఘన విజయం సాధించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను పవర్ పాయింట్ ద్వారా ప్రదర్శించారు. వాటి పరిస్థితేమిటని నిలదీసే సరికి చంద్రబాబు సహా ప్రతిపక్ష సభ్యులు చాలా సందర్భాల్లో నోరెత్తడానికి వీల్లేకపోయింది. ఇదంతా- చంద్రబాబును తీవ్ర ఆందోళనలోకి నెట్టిందని అంటున్నారు పార్టీ నేతలు.

ఫిరాయింపుల వల్ల మరో తలనొప్పి..
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ముఖం చాటేశారు. తెలుగుదేశానికి గుడ్ బై చెప్పారు. భారతీయ జనతాపార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. కాషాయ కండువాను కప్పుకొన్నారు. రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ రావు వంటి చంద్రబాబుకు అత్యంత విశ్వసపాత్రులైన నేతలు పార్టీ ఫిరాయించడం కూడా చంద్రబాబును దిగ్భ్రాంతికి గురి చేసిందని అంటున్నారు. మరోవంక- వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ చిన్న కనుసైగ చేస్తే చాలు.. పార్టీ ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నారు కొందరు టీడీపీ నేతలు. బోండా ఉమామహేశ్వరరావు, పయ్యావుల కేశవ్ వంటి నేతలు ఓ దశలో వైఎస్ఆర్ సీపీలో చేరే సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో పార్టీని మరో అయిదేళ్ల పాటు కాపాడుకోవడం ఎలా అనే అంశం కూడా చంద్రబాబును ఆందోళనకు గురి చేస్తోందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications