చులకన చేశారు: కాంగ్రెసు ప్రభుత్వంపై చంద్రబాబు
హైదరాబాద్: విద్యలో మనం చాలా వెనకబడిపోయామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మానవ వనరులపై ఆయన గురువారం శ్వేతపత్రం విడుదల చేశారు. విశ్వవిద్యాలయాలను ఆఫీసర్స్ క్లబ్బుల్లో, డిగ్రీ కళాశాలల్లో పెట్టారని ఆయన అన్నారు. ఉన్నత విద్యను గత కాంగ్రెసు ప్రభుత్వం చులకన చేశారని ఆయన అన్నారు. కాంగ్రెసు పాలనలో కళాశాలలు పెరిగినా వాటిలో చేరే విద్యార్థులు తగ్గిపోయారని ఆయన అన్నారు
తమ పార్టీ పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని ఆయన చెప్పారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అభివృద్ధి సాధించామని ఆయన చెప్పారు. మాతాశిశు మరణాల విషయంలో పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగంలో ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని ఆయన అన్నారు.
ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత తమదేనని ఆయన అన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతిభా అవార్డులు ఇచ్చామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ పౌష్టికాహారం అందాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన అన్నారు. గత దశాబ్ద కాలంలో విద్యను నిర్వీర్యం చేశారని ఆయన విమర్సించారు.

గత ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసిందని ఆయన అన్నారు. జనాభా నియంత్రణను సరిగా అమలు చేయలేకపోయారని అన్నారు. యుపిఎ పాలన దగాపడ్డ దశాబ్దమని ఆయన వ్యాఖ్యానించారు. తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉందని రిజర్వ్ బ్యాంకు చెప్పిందని ఆయన అన్నారు. ఆర్థిక సహాయ సంస్థను మూసేశారని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలన్నీ దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు.
ఆరోగ్యశ్రీ వల్ల కేవలం 1.5 శాతం మంది మాత్రమే ప్రయోజనం పొందారని ఆయన చెప్పారు. గతంలో వెలుగు ప్రాజెక్టు ద్వారా 3 కోట్ల రూపాయలు అందించామని ఆయన చెప్పారు. విద్యరంగంలో ప్రగతికి ఇప్పటికే బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరినీ పాఠశాలకు పిలిపించే ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం అమలును సరిదిద్దుతామని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యా హబ్గా, నాలెడ్జ్ హబ్గా రూపొందిస్తామని ఆయన చెప్పారు. బయటి విద్యార్థులను కూడా ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. డ్వాక్రాలను సద్వినియోగం చేసుకుంటే చాలా మేలు జరుగుతుందని ఆయన అన్నారు. పేదరిక నిర్మూలన చేస్తామని ఆయన చెప్పారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications