బాబు కసరత్తు: రుణమాఫీకి లైన్ క్లియర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రైతుల రుణమాఫీకి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. రైతులు ఒక్కపైసా చెల్లించకుండానే రుణాలను రీషెడ్యూల్ చేయించడంతో పాటు కొత్త రుణాలను మంజూరు చేయించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళిక రచించారు. నిన్నటిదాకా రుణాల రీషెడ్యూల్ కు ససేమిరా అన్న బ్యాంకులు కూడా చంద్రబాబు ప్రణాళిక చూశాక క్షణాల్లోనే అంగీకరించాయి. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ రుణాలతో పాటు డ్వాక్రా రుణాల మాఫీకి మార్గం సులభమైంది.
బుధవారం కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో రుణమాఫీపై వివరించారు. రైతులు బ్యాంకులకు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, మొత్తం రుణంలో 20 శాతాన్ని ప్రభుత్వమే చెల్లించి రుణాలను రీషెడ్యూల్ చేయించనుందని ఆయన ప్రకటించారు. ఇందుకు బ్యాంకులు కూడా పచ్చజెండా ఊపాయని వెల్లడించారు.
రుణాలు రీషెడ్యూలు కాగానే రైతులకు బ్యాంకులు కొత్తగా పంట రుణాలు ఇస్తాయని తెలిపారు. 20 శాతం పోగా మిగిలిన 80 శాతాన్ని నాలుగేళ్లలో నాలుగు విడతలుగా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన వివరించారు. రుణాలపై వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రుణమాఫీపై తాజాగా బ్యాంకర్లకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాన్ని ఆయన విశదీకరించారు. బ్యాంకులతో జరిగిన ఒప్పందాలపై బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఆమోదించామని ఆయన తెలిపారు.

రైతులను రుణ విముక్తులను చేయడంతో పాటు వ్యవసాయాభివృద్ధి, ఉత్పాదకత, రైతుల సంక్షేమం, సాధికారత, ఆర్ధిక పరిపుష్టి సాకారమయ్యేలా ‘‘రైతు సాధికారత సంస్థ''ను ఏర్పాటు చేయనున్నామన్నారు. వ్యవసాయం, అనుబంధరంగాల సంస్థలన్నిటినీ ఇందులో విలీనం చేస్తామన్నారు. ఎపి సీడ్స్, ఆగ్రోస్, ఆయిల్ఫెడ్, వేర్హౌసింగ్ సంస్థలు సహా అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్నూ ఇందులోనే కలిపేస్తామన్నారు.
ఆదాయ వనరుల సమీకరణ ద్వారా వచ్చిన నిధులతో పాటు సెస్ వసూళ్లు, లెవీపై వచ్చే మొత్తం, ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయం, బ్యాంకులు, బాండ్లు, డిబెంచర్స్ ఇతర ఆర్ధిక సంస్థల నుంచి వచ్చే నిధులన్నీ రైతుసాధికారత సంస్థలోనే ఉంచి, దానినే బ్యాంకులకు గ్యారెంటీగా చూపిస్తామన్నారు. దీపావళిలోగా రైతు సాధికారత సంస్థను ప్రారంభిస్తామన్నారు. ఎర్రచందనం వేలం, అబ్కారీ, ఇసుక తవ్వకాల ద్వారా వచ్చే ఆదాయంలో 75 శాతాన్ని సాధికారసంస్థకు బదలాయిస్తామన్నారు.
రైతు సాధికారత సంస్థ మాదిరిగా డ్వాక్రా మహిళలను రుణ విముక్తులను చేసేందుకు ప్రత్యేకంగా డ్వాక్రా సాధికారత సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. మహిళల రుణాల రీషెడ్యూలులో భాగంగా 20 శాతం చెల్లిస్తామని, బ్యాంకుల నుంచి రుణాల రీషెడ్యూలు కాగానే..ప్రతి సంఘానికి రూ.10 వేల చొప్పున కార్పస్ఫండ్ను ఇస్తామని ప్రకటించారు. ఇలా మొత్తం ఏడు లక్షల సంఘాలకు రూ.6,700 కోట్లు వారి చేతుల్లోనే ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications