పొద్దున అలయ్, రాత్రి లడాయ్: కెసిఆర్పై చంద్రబాబు
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కోతలకు తానే కారణమంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వ్యాఖ్యానించడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. విద్యుత్ కొరతకు తానెలా కారణమనే దానిపై ఎన్ని సార్లు నిలదీసినా కేసీఆర్ వివరణ ఇవ్వలేకపోతున్నారని, తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు అన్నారు.
సోమవారం తెలంగాణ టిడిపి నేతలతో ఆయన సమావేశమై దాదాపు గంటన్నరపాటు తెలంగాణలోని సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యుత్ కోతలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను టిటిడిపి నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకురాగా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పొద్దునపూట కౌగిలించుకుంటాడని, సాయంత్రానికి తనపై ఏదో విమర్శకు దిగుతాడని, కెసిఆర్ వ్యవహార శైలి నాకర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు.

అదనపు విద్యుత్ కావాలని ఏనాడూ కేంద్రాన్ని కేసీఆర్ కోరలేదని తానే ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్ ను కలిసి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు కూడా అవసరానికి సరిపడా విద్యుత్ ఇవ్వాలని కోరుతున్నానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలూ బాగుండాలనేది తన కోరికని ఇవన్నీ పెడచెవిన పెట్టి కేసీఆర్ తనపైనే విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఉన్న 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఉండాలని ఈనెల 10 నుంచి మూడు రోజుల పాటు సాగే బస్సుయాత్రను విజయవంతం చేయాలని నేతలకు ఆదేశించారు. రైతుల సమస్యలు, వ్యవసాయానికి విద్యుత్ తదితర అంశాలపై ప్రజల్లోకి వెళ్లి రైతులకు ఓదార్పునివ్వాలని ఆయన సూచించారు.
కరెంటు కావాలని కేంద్రాన్ని కేసీఆర్ అడగనే లేదని, రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని తానే కోరుతున్నానని టీ-టీడీపీ ఎమ్మెల్యేలతో అన్నారు. ఎన్నికల ముందు రప్పిస్తానని చెప్పిన ఛత్తీస్గఢ్ కరెంటు ఎక్కడికి పోయిందని కేసీఆర్ను టీడీపీతోపాటు కాంగ్రెస్ నేతలూ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications