మీరుంటారా, నేనుంటానా, నేను చెప్పలేదు: జగన్ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు
ఐటిని నేను కనిపెట్టానని చెప్పలేదని, ప్రోత్సహించనవారిలో మొదటివాడిని తానే అని ఆయన అన్నారు. జగన్పై ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం శాసనసభలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. విపక్షం హుందాగా వ్యవహరిస్తే సభకు గౌరవమని ఆయన అన్నారు. నేనుంటానా, మీరుంటారా అనేది వేరే కానీ రాష్ట్రం, తెలుగు జాతి శాశ్వతమని అన్నారు. తాను తెలుగుజాతికి, ఎపికి విశ్వాసం కలిగిస్తున్నానని చెప్పారు.
కొందరు అడ్డగోలుగా సంపాదించారని ఆయన అన్నారు. డబ్బుల వల్ల ఆనందం రాదని ఆయన అన్నారు. హ్యాపినెస్ అనేది ఉండాలని, దాని కోసం తాను కృషి చేస్తున్నానని ఆయన చెప్పారు. ఎపి అగ్రస్థానంలో నిలబెట్టి హ్యాపినెస్ తేవడానికి ప్రయత్నిస్తన్నానని ఆయన చెప్పారు.
ఐటిని తాను కనిపెట్టానని చెప్పలేదని ఆయన అన్నారు. ఐటికి ప్రోత్సహించినవారిలో తానే మొదటివాడినని ఆయన అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాదులను తానే అభివృద్ధి చేశానని ఆయన చెప్పారు.
విజన్ 2020ని తానే రూపొందించానని, అప్పుడు 420 అన్నారని చంద్రబాబు అన్నారు ఎపికి 2022, 2050 రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. 2022 నాటికి ఎపి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒక్కటి కావాలనేది తమ సంకల్పమని, చేసి తీరుతామని ఆయన చెప్పారు. 2050 నాటికి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెడుతామని అన్నారు.
కరువును కూడా జయించగలుగుతామని నమ్మకం కలగాలని ఆయన అన్నారు. ఇందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. తాను నిత్య విద్యార్థిని అని, ప్రజలే తనకు హైకమాండ్ అని ఆయన చెప్పారు.
కసిగా పనిచేసి తెలుగుజాతి అంటే ఏమిటో నిరూపిస్తామని చంద్రబాబు అన్నారు. ప్రజలు కూడా మిమ్మిల్ని చూసి బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కట్టుబట్టలతో వచ్చామని తనపై నమ్మకంతో ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు. మంచిమాట ఎవరు చెప్పినా విని ఆచరిస్తామన్నారు.
తనను, ఎన్టీఆర్ను మాత్రమే నేరుగా ప్రజలు ఎన్నుకున్నారని, మిగిలిన వారు ఢిల్లీని చూపించి ఓట్లు అడిగారని అన్నారు. ప్రతిపక్షాలు రాజధానికి భూములు ఇవ్వకుండా అడ్డుపడ్డాయని అన్నారు. అమరావతికి వాస్తుబలం ఉందని అన్నారు.