సర్వే రాళ్లపై జగన్ ఫొటో ఎందుకు లేదంటే-ఆసక్తికర కారణం చెప్పిన చంద్రబాబు..!
ఏపీలో ఐదేళ్ల వైసీపీ పాలనపై వరుసగా శ్వేతపత్రాలు ఇస్తున్న సీఎం చంద్రబాబు ఇవాళ ప్రకృతి వనరుల దోపిడీపై విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన వరుసగా వివరాలు వెల్లడిస్తూ మధ్యలో మాజీ సీఎం జగన్ ప్రస్తావన రాగానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సమగ్ర భూసర్వే గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో జగన్ తీసుకున్న ఓ నిర్ణయం వెనుక కారణమేంటో ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం సమగ్ర భూసర్వే చేపట్టిందని, ఇందులో భాగంగా సర్వే రాళ్లపై జగన్ పేరు ముద్రించారని, ఓ దశలో ఫొటో కూడా ముద్రించాలని భావించినా వెనక్కి తగ్గినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అయితే ఇలా సర్వే రాళ్లపై జగన్ ఫొటో ముద్రించకుండా ఎందుకు వెనక్కి తగ్గారనే దానికి చంద్రబాబు తనకు తెలిసిన కారణం పేర్కొన్నారు. ఆ కారణంతోనే జగన్ సర్వే రాళ్లపై తన ఫొటో వేసుకోలేదన్నారు.

సర్వే రాళ్లపై చనిపోయిన వారి ఫొటో వేసుకుంటారని కొందరు జగన్ కు చెప్పడం వల్లే దానిపై వెనక్కి తగ్గి కేవలం పేరుతో సరిపెట్టారని సీఎం చంద్రబాబు గత వైసీపీ పాలనలో జరిగిన వ్యవహారాన్ని వెల్లడించారు. అలా కాకుంటే సర్వే రాళ్లపై జగన్ ఫొటో కూడా ఉండేదన్నారు. ఆ తర్వాత జగన్ తన పేరు సర్వే రాళ్లపై ముద్రించుకునేందుకు పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.640 కోట్లు ఖర్చుపెట్టినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఇలాంటి చర్యల్ని ఆమోదిస్తారా అని ఆయన ప్రశ్నించారు. తామేమైనా రాజులమా అని అడిగారు.












Click it and Unblock the Notifications