ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ : ప్రకాశం జిల్లా టీడీపీ కార్యకర్తలపై పోలీసుల వేధింపులపై ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కొనసాగుతున్న దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ప్రకాశం జిల్లా లింగసముద్రం పోలీసులు వైసీపీ నేతల ఆదేశాలతో మొగిలిచర్లకు చెందిన టిడిపి కార్యకర్తలను స్టేషన్ కు పిలిపించి వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 6 నుండి 10 ఏళ్ల వయసున్న చిన్న పిల్లలు కూడా ఉన్నారంటూ ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నిత్యం వేధింపులు పెరిగిపోతున్నాయని ఆయన డీజీపీ గౌతమ్ సవాంగ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లాలో పోలీసుల వేధింపుల ఘటన .. చంద్రబాబు లేఖ
పోలీసులు ఎం. శ్రీకాంత్, పి రత్తయ్య అనే కార్యకర్తలను చిత్రహింసలకు గురిచేశారని, తెలుగుదేశం పార్టీని వీడి బయటకు రావాలని వారిని హింసించారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. అర్ధరాత్రి రెండు గంటల వరకు వేధించి వదిలి పెట్టారని మళ్లీ ఉదయాన్నే ఆరున్నరకు లింగసముద్రం ఎస్సై పోలీస్ స్టేషన్ కు రావాలని శ్రీకాంత్, రత్తయ్య లకు ఫోన్ చేశారని మండిపడ్డారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక వారిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్న చంద్రబాబు ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అంటూ డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఇద్దరు టిడిపి కార్యకర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనతో మిగిలిన వారిని హడావిడిగా పోలీస్ స్టేషన్ నుండి పంపించి వేశారని, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు.
SamanthaAkkineni: స్మైలీ బ్యూటీ సామ్ ఇంట హాట్ గా ఎపుడు చూసి ఉండరు (ఫొటోస్)
వైసీపీ నేతల ప్రయోజనాల కోసం పోలీసులు పని చేస్తున్నారన్న చంద్రబాబు
ప్రకాశం జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో పోలీసుల వేధింపులు ఏ స్థాయికి చేరుకున్నాయో అర్థం చేసుకోవచ్చు అంటూ చంద్రబాబు డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి తీసుకువెళ్లారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రయోజనాల కోసం రాష్ట్రంలో కొందరు పోలీసులు పని చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. గత రెండేళ్లలో పోలీసుల వేధింపులు తారా స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల ప్రతిష్ట రోజు రోజుకి దిగజారి పోతోందని లేఖలో స్పష్టం చేశారు. చట్టానికి లోబడి పోలీసులు విధులు నిర్వహించాలని తన లేఖ ద్వారా హితవు పలికారు.
లింగసముద్రం ఘటనపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ లింగసముద్రం ఘటనపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలీసులు ఎలాంటి పక్షపాతం లేకుండా విధులు నిర్వర్తించాలని ఆదేశించాలని చంద్రబాబు నాయుడు తన లేఖ ద్వారా స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక మార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి నేతలపై చోటు చేసుకుంటున్న దాడుల ఘటనలపై చంద్రబాబు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. తాజాగా మరో మారు ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న టిడిపి నేతలపై వేధింపుల ఘటనపై లేఖ రాసి ఏపీ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉందో అందులో ప్రస్తావించారు.
లింగ సముద్రంలో జరిగిన ఘటన వివరాలివే
ప్రకాశం జిల్లాలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లాలోని లింగసముద్రం మండలం మొగిలిచర్ల ఒక భూమికి సంబంధించి టిడిపి, వైసిపి సానుభూతిపరుల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లో ఇరువర్గాలను పిలిచి మాట్లాడుతున్న క్రమంలో ఓ టిడిపి నాయకుడిని వైసీపీ నాయకుడు తీవ్రపదజాలంతో దుర్భాషలాడారు. ఇక అతని మాటలను వీడియో రికార్డ్ చేసిన టీడీపీ కార్యకర్త రత్తయ్య ఆ వీడియోను సదరు టిడిపి నాయకుడికి పంపగా, వైసీపీ టీడీపీ నాయకుల మధ్య గొడవ పెద్దదయింది.
పోలీసుల వేధింపులతో భయపడి సూసైడ్ యత్నం చేసిన టీడీపీ కార్యకర్తలు
ఈ క్రమంలో ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారడానికి వీడియోలు తీసి వాటిని షేర్ చేసిన టిడిపి కార్యకర్తలే కారణమని భావించి స్టేషన్ కు పిలిపించినట్లు సమాచారం. అయితే పోలీసులు పదేపదే స్టేషన్ కి పిలుస్తూ వేధిస్తుండటంతో తమను ఎన్కౌంటర్ చేస్తారేమో అని భయపడి ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు టిడిపి కార్యకర్తలను వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులు వేధిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపైనే చంద్రబాబు ఏపీ డీజీపీకి లేఖ రాశారు.