కేంద్రం చేతికి పోలవరం ప్రాజెక్ట్?: చంద్రబాబు వ్యాఖ్యలు మంచికేనా!
అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని, మాకెలాంటి అభ్యంతరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే తెరలేపాయి. అసలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి అప్పగిస్తే ఎవరికి లాభం? అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఏం చేయాలి?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న కష్టాలేంటి? పోలవరం ప్రాజెక్ట్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపథ్యంలో సాధ్యమైనంత వరకు మరిన్ని నిధులను విడుదల చేయాలి. కానీ పోలవరం ప్రాజెక్ట్కు కేంద్రం నిధులు విడుదల ఆలస్యం అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్ మరితంగా జాప్యం అవుతుంది.
కమీషన్ల కోసం కాల్వలు తవ్విన నేతలకు మాట్లాడే అర్హత లేదు: పోలవరంపై బాబు
అంతేకాదు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం విడుదల చేస్తున్న నిధులు వచ్చినవి వచ్చినట్లుగా ఏనుగులా ఆరగించేస్తున్న ఓ ఎంపిగారి కంపెనీని, దాని అనుబంధ కంపెనీలని వదిలించుకోవాలని ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ చాలా గట్టిగా వాదిస్తోంది. దీనికి తోడు కేంద్రం కూడా పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు విడుదల చేసిన నిధుల వివరాలను రాష్ట్ర బీజేపీ నేతలు లెక్కలు అడుగుతుండటం రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు.
కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలవరం ప్రాజెక్టుని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నాయని కేవీపీ అనుమానం వ్యక్తం చేయడంతో ఈ అంశం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అంగీకరించారు.
గురువారం ఉదయం పోలవరం పనులను డ్రోన్ కెమెరాతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించి సమీక్షించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది వరదలు వస్తున్న కారణంగానే పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. వరదలు వచ్చి ఆరేడు నెలల పాటు పనులు సాగడం లేదని, 'స్పిల్ వే'లను నిర్మించేందుకు వరదలే అడ్డంకిగా మారుతున్నాయని అన్నారు.
పోలవరంపై కేవీపీ వ్యాఖ్యలు: వైసీపీ, కాంగ్రెస్లు అస్త్రంగా మార్చుకుంటాయా?
మరో రెండు వారాల పాటు పనులు ప్రారంభించే అవకాశాలు లేవని, సెప్టెంబర్ నుంచి వేగంగా పనులు జరుగుతాయని తెలిపారు. వచ్చే నెలకల్లా పోలవరం ప్రాజెక్టు సైట్ వరకు ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. సర్వేలెన్స్, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.
ఇక ప్రాజెక్టులో 10.49 కోట్ల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ జరుగవలసి ఉండగా కేవలం 4.02 కోట్ల క్యూబిక్ మీటర్ల వర్క్ మాత్రమే జరిగిందని ఆయనే స్వయంగా చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నేతలు గొప్పలు చెబుతున్నారంటూ పరోక్షంగా కేవీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇకపై పోలవరం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన చేపడతామని అన్నారు. ఇకపై ప్రతి నెల ప్రాజెక్టు పనులు పరిశీలిస్తానని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వస్తున్న విమర్శలపై స్పందిస్తూ కాంగ్రెస్, వైసీపీలే ఈ ప్రాజెక్టుకి అడుగడుగునా అడ్డుపడుతున్నాయని, ప్రభుత్వంపై నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
చివరగా ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం ఇంకా రూ.1700 కోట్లు విడుదల చేయాల్సి ఉందని, ఒకవేళ కేంద్రమే ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని, మాకెలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇకపై వేగవంతం చేస్తామని చెబుతూనే మళ్ళీ కేంద్రం నుంచి నిధులు అందాలి అని చంద్రబాబు చెప్పడం చూస్తే ఆయన మళ్ళీ పాతపాటే పాడుతున్నట్లు స్పష్టం అవుతోంది.