వైఎస్ వివేకా హత్యలో సూత్రధారే వినుకొండ హత్యలో కూడా!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా, కూటమి ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇసుక, శాంతిభద్రతల పైన ప్రధానంగా చర్చించారు.
కక్ష సాధించాలంటే ముందు వరుసలో నేనే ఉండాలి
అక్రమ కేసులు ఎదుర్కొని 53 రోజులు తాను జైల్లో ఉన్నానని, కక్ష సాధింపు చర్యలకు దిగాలంటే ముందు ఉండాల్సింది తానేనని కానీ ప్రజలు మనల్ని అందుకోసం గెలిపించలేదని చంద్రబాబు పేర్కొన్నారు. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టప్రకారం శిక్షిద్దామని పేర్కొన్నారు.

జగన్ మళ్ళీ వివేకా హత్యకేసు నాటకాన్ని మొదలెట్టారు
వివేకా హత్యకేసులో నడిపిన నాటకాన్ని జగన్ మళ్ళీ మొదలుపెట్టాడని వినుకొండ వ్యవహారంలో అదే కుట్ర చేస్తున్నారని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని తొలిరోజే అడ్డుకోవడం పైన చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి నెలరోజులు కాలేదు.. అప్పుడే విమర్శలు మొదలుపెట్టారని మండిపడ్డారు. తప్పులు చేసి పక్కవారిపై నెట్టేయడం జగన్ కు అలవాటని వివేకా హత్య విషయంలోనూ ఇతరులపైకి నెపం నెట్టే ప్రయత్నం చేశారని చంద్రబాబు గుర్తుచేశారు.
ఇసుక విషయంలో ఎమ్మెల్యేలకు బాబు వార్నింగ్
టిడిపి కూటమి ఎమ్మెల్యేలకు ఇసుక జోలికి వెళ్లొద్దని చంద్రబాబు సూచించారు. ఇసుక ధరల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా, ఉచిత ఇసుక విధానాన్ని మరింత పాదదర్శకంగా అమలు చేయడానికి ఎమ్మెల్యేల సూచనలు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బులు లేవని, అయినా పనులు ఆపలేమని పేర్కొన్న చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
మదనపల్లి ఘటనపై చంద్రబాబు వ్యాఖ్యలు
ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై పడిన గుంతలను పూడ్చే కార్యక్రమం చేద్దాం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయడం మానేశాయని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగిన ఘటన అందుకు నిదర్శనం అని చెప్పారు. అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగిన మర్నాడు వరకు రెవెన్యూ అధికారులు పోలీసులు పట్టించుకోలేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామన్న పవన్ కళ్యాణ్
ఏది ఏమైనా ప్రజా సంక్షేమమే అజెండాగా ముందుకు సాగాలన్నారు చంద్రబాబు. మూడు పార్టీల మధ్య సమన్వయం ఉండాలనే విషయాన్ని నాదెండ్ల మనోహర్ ప్రస్తావించగా, దీనిపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్న తాను జనసేన ఎమ్మెల్యేలందరూ సపోర్ట్ చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.












Click it and Unblock the Notifications