కొత్త జిల్లాలపై చంద్రబాబు ఫైర్-అశాస్త్రీయం, రాజకీయ కోణంలోనే-లెక్క సరిచేస్తామని వెల్లడి
ఏపీలో కొత్త జిల్లాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. వీటిపై రాజకీయ పార్టీలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. అధికార వైసీపీ కొత్త జిల్లాల ఏర్పాటును తమ ఘనతగా చెప్పుకుంటుండగా.. విపక్షాలు మాత్రం దీన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుసరించిన ప్రామాణికాల్ని తప్పుబట్టారు.
కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలోనే జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా చోటు చేసుకున్న తప్పిదాల్ని సరిదిద్దుతామని తెలిపారు. తద్వారా కొత్త జిల్లాల్ని టీడీపీ అంగీకరించడం లేదనే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పటికే హిందూపురం జిల్లా కేంద్రం సహా పలుచోట్ల కొత్త జిల్లాలపై టీడీపీ నేతలు నిరసనలు తెలిపినా వైసీపీ సర్కార్ మాత్రం వాటిని పట్టించుకోలేదు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పన్నుల పెంపును చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. త్వరలో బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపడతామన్నారు. జగన్ వ్యక్తిగత ఆదాయం కోసం ప్రజలపై భారీగా పన్నులు విధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అలాగే సీపీఎస్ రద్దు విషయంలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. 80 శాతం పనులు పూర్తయిన అమరావతిలో మిగతా పనుల్ని కూడా జగన్ చేయలేకపోతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. జగన్ పాలనపై ఆయన నియోజకవర్గం కూడా సంతృప్తిగా లేదన్నారు.