పోలవరం పూర్తి చేసేది 2025లోనా ? మేమైతే 2020లోనే చేసే వాళ్లమన్న చంద్రబాబు..
ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మరో రెండేళ్లు గడువు కావాలని వైసీపీ సర్కార్ కేంద్రాన్ని కోరడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. పోలవరం ఎత్తు విషయంలోనూ వైసీపీ సర్కార్ ప్రజల్ని మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఢిల్లీలో జరిగిన భేటీలో చర్చించి ఖరారు చేసిన అంశాలపై చంద్రబాబు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు.
రాష్ట్రంలో నదుల్ని అనుసంధానిస్తే ప్రతీ ఎకరానికీ నీళ్లు ఇవ్వొచ్చన్న ఉద్దేశంతో రూ.64 వేల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. ఇందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 72 శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు. కానీ ఇప్పుడు వైసీపీ సర్కార్ 2025 నాటికి పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేస్తామని సిగ్గులేకుండా చెబుతోందని చంద్రబాబు ఆక్షేపించారు. అసలు ప్రాజెక్టు పూర్తవడానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్ధితుల్లో ఉందన్నారు.

ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసి రాష్ట్ర ప్రగతిని, మన భవిష్యత్తును అడ్డుకునే పరిస్ధితి తీసుకొచ్చారంటూ వైసీపీ సర్కార్ ను చంద్రబాబు విమర్శించారు. అదే టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉండేవారమని ఆయన గుర్తుచేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎప్పుడు పూర్తి చేస్తుందో చెప్పలేని పరిస్ధితుల్లో ఉందని చంద్రబాబు విమర్శించారు.
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంస్కరణలతో ఇప్పటికీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం తొలి స్ధానంలో ఉందన్నారు. ఎఫ్డీఏ, ఐటీ ఎగుమతుల్లోనూ తెలంగాణతో పోలిస్తే రాష్ట్రం దారుణంగా ఉందన్నారు. మద్యం మాత్రం ఏరులై పారుతోందని, విశాఖను గంజాయి రాజధానిగా మార్చేశారని చంద్రబాబు ఆరోపించారు. తమ పాలనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినట్లు ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications