టీ బాధ్యత మాకప్పగిస్తే: కేసీఆర్పై బాబు, ఇద్దరేనని ట్విస్ట్
హైదరాబాద్: తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి వంటి సీనియర్ తెలంగాణ టీడీపీ నేతలు తెరాసలోకి వెళ్లనున్న నేపథ్యంలో చంద్రబాబు టీ-టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో గురువారం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
రేపటి నుంచి తెలంగాణలో ప్రారంభమయ్యే బస్సు యాత్రను విజయవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. బస్సు యాత్ర సందర్భంగా విద్యుత్ శాఖను టీడీపీకి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సవాల్ చేయాలని వారితో చెప్పారని తెలుస్తోంది. ఆ శాఖను తనకు అప్పగిస్తే తెలంగాణకు విద్యుత్ను తీసుకొచ్చి చూపిస్తానని ఆయన చెప్పారని సమాచారం.
తాను ఆంధ్రప్రదేశ్కు నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం అనేక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నానని, కేసీఆర్ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో లోటు ఉన్నప్పటికీ ఎలాంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోలేదని చెప్పారని తెలుస్తోంది. స్వార్థపరులే టీడీపీని వీడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని, పార్టీకి బలం కార్యకర్తలేనని, నేతలు స్వార్థంతో మారినే కేడర్ నిస్వార్థంగా ఉందన్నారు. నేతలు వస్తుంటారు.. పోతుంటారని, కార్యకర్తలు మాత్రం తమ వెంటే ఉన్నారన్నారు. తెలంగాణలోను టీడీపీ బలంగానే ఉందని, తమ నేతలను ప్రలోభ పెట్టి ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, పార్టీని బలోపేతం చేసుకోవడం తమకు తెలుసునని, వాస్తవాలు చెబితే ప్రజలకు ఎవరేంటో తెలిసిపోతుందన్నారు.
మరోవైపు, ఉదయం కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సాయంత్రం చంద్రబాబును కలిశారు. ఇదిలా ఉండగా, ధర్మారెడ్డి, ప్రకాశ్ గౌడ్లు పార్టీలోనే ఉంటామని చెప్పారని ఎర్రబెల్లి, ఎల్ రమణలు చెప్పారు. ఇద్దరు మాత్రమే పార్టీని వీడుతున్నారని, మిగిలిన వారు పోవడం లేదని అభిప్రాయపడ్డారు.
కాగా, తెలంగాణలో విద్యుత్ సమస్యకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రులు, తెరాస నేతలు చంద్రబాబునే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. తెరాసలో చేరుతానని ఈ రోజు చెప్పిన తలసాని కూడా చంద్రబాబు తెలంగాణను ఇబ్బంది పెడుతున్నారని, విద్యుత్ సమస్య సృష్టిస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే.
విద్యుత్ శాఖను అప్పగించండి
తెలంగాణ ప్రభుత్వానికి చేతకాకపోతే విద్యుత్ శాఖను టీడీపీకి అప్పగించాలని, విద్యుత్ సమస్యను పరిష్కరించి చూపిస్తామని టీ-టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు 7 గంటలపాటు విద్యుత్ అందిస్తామన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే కరెంటు కష్టాలు వచ్చాయని, ఇక్కడి కరెంటు కష్టాలకు చంద్రబాబు కారణం కాదన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి అందాల్సిన కరెంట్ అందుతోందని, తెరాస ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క యూనిట్ కూడా కొనలేదన్నారు.