బీజేపీ మోసాన్ని నిలదీయండి: ఎంపీలతో చంద్రబాబు, ‘జగన్ దృష్టంతా వాటిపైనే..’
Recommended Video
అమరావతి: విభజన హామీలు నెరవేర్చేలా కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఎంపీలకు సూచించారు. రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజల ఆశలన్నీ పార్లమెంట్పైనే ఉన్నందున.. ఎంపీలంతా హక్కుల సాధన కోసం ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
అన్నివైపుల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. పార్టీ ఎంపీలతో సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కాపు రిజర్వేషన్లపై నిలదీయండి
కాపు రిజర్వేషన్ల చట్టం కేంద్రం వద్ద 9 నెలలుగా పెండింగ్లో ఉన్నందున..., రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చే అంశంపై ఒత్తిడి పెంచాలని దిశానిర్థేశం చేశారు. ప్రకాశం నిమ్జ్పై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, నిమ్జ్కు అవసరమైనవి ఇస్తామన్నా కేంద్రం నాలుగేళ్లుగా నాన్చుతోందని టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు అన్నారు.
బీజేపీ మోసాన్ని ఎండగట్టండి..
దేశవ్యాప్తంగా అన్ని వేదికలపైనా బీజేపీ మోసాన్ని ఎండగట్టాలని సూచించారు. కేంద్రం చెప్పేదొకటి, చేసేదొకటన్న విషయం అఫిడవిట్లలో తేలిపోయిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.
జగన్ దృష్టంతా వాటిపైనే..
కేసుల మాఫీపై తప్ప జగన్ దృష్టి మరి దేనిపైగా లేదని చంద్రబాబు విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై జగన్ మోసాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ముస్లిం మైనారిటీలు బీజేపీకి పూర్తిగా దూరమయ్యారని.. అలాంటి బీజేపీతో జగన్ అంటకాగుతున్నారని దుయ్యబట్టారు.
పోరాటం తీవ్రతరం
ఒంగోలు ధర్మపోరాట సభ విజయవంతమైందని, ప్రజల స్పందన ఎలా ఉందో అంతా గమనించారని సీఎం చెప్పారు. కడప ఉక్కు తరహాలోనే రైల్వేజోన్పై పోరాటం తీవ్రం చేయాలని ఎంపీలకు చంద్రబాబు ఆదేశించారు. ప్రజాక్షేత్రంలో, పార్లమెంటులో పోరాటం చేయాలని...కేంద్రంపై ఒత్తిడి పెంచాలని అన్నారు.