చంద్రబాబు స్వదేశీ మంత్ర-యువ టెక్నోక్రాట్లకు కీలక పిలుపు..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో టెక్నాలజీ వినియోగంపై పలు దశల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం చంద్రబాబు.. వాటి ద్వారా సాధిస్తున్న ఫలితాలను ఇవాళ విశాఖలో జరిగిన 28వ జాతీయ ఈ-గవర్నెన్సు సదస్సులో వెల్లడించారు. ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్న పౌర సేవలు, పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ వంటి అంశాలతో పాటు సంజీవని ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
సాంకేతికతతోనే ప్రజలకు పాలను మరింత చేరువ చేసే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ ఈ-గవర్నెన్సు సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సివిల్ సర్సీసెస్-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ థీమ్ తో దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖల ద్వారా అందే పౌర సేవలను మరింత సమర్ధంగా నిర్వహించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి సాంకేతికత కీలకమని సీఎం స్పష్టం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఐటీ, ఈ-గవర్నెన్సు అంశాలతో పాలనలో మార్పులు వచ్చాయని సీఎం తెలిపారు. కమ్యూనికేషన్ సంస్కరణల ద్వారా ప్రజా జీవనంలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని స్పష్టం చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకుని గతంలోనే ఉమ్మడి ఏపీలో ఈ-సేవ, మీ-సేవ ద్వారా ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లామని, ఈ-ఫైల్స్, ఈ-కేబినెట్ లాంటి అంశాలతో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వ్యవస్థలను అమలు చేసే సమయంలో సైబర్ సెక్యూరిటీ కూడా అత్యంత కీలకమన్నారు.

భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో నంబర్ వన్ గా నిలిపేందుకు స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు యువ సాంకేతిక నిపుణులకు విజ్ఞప్తి చేశారు.మనం టెక్నాలజీలో బలంగా ఉన్నప్పటికీ, ఇతర దేశాలపై ఆధారపడుతున్నామని, భారతదేశంలోనే ఉత్పత్తి అవసరాన్ని గుర్తించాలన్నారు. ఏపీలో అమరావతిలో క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేస్తోందని, రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లను ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తుందని ఆయన తెలిపారు. జనవరి, 2026 నాటికి అమరావతి క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ క్లబ్లో చేరుతుందన్నారు.

అలాగే రాష్ట్రంలో తాము 751 పౌరసేవల్ని వాట్సప్ ద్వారా పౌరులకు అందిస్తూ పాలనను వారి మొబైల్ ఫోన్ల వరకూ తీసుకెళ్లామని సీఎం తెలిపారు. సాంకేతికత కారణంగా పొరుగు రాష్ట్రాలతోనూ పోటీ పెరిగిందన్నారు. ఏపీలో వైద్య సేవలను టెక్నాలజీతో అనుసంధానం చేసే సంజీవని ప్రాజెక్టు చేపట్టామని చంద్రబాబు వెల్లడించారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి డిజిటల్ హెల్త్ రికార్డులను రూపోందిస్తున్నామని త్వరలో ఈ వ్యవస్థను మొత్తం దేశానికీ అమలు చేసేందుకు అస్కారం ఉందన్నారు.












Click it and Unblock the Notifications