దురదృష్ట ఘటన, ఆదుకుంటా: బాబు, వెంట కేంద్రమంత్రి
రాజమండ్రి: గ్యాస్ పైప్ లైన్ ప్రమాదం దురదృష్టకరమైన ఘటన అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలం నగరం గ్రామంలో చంద్రబాబు మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఘటన పైన పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామన్నారు. నిర్లక్ష్యం వహించిన వారి పైన చర్యలు తీసుకుంటామని, ఈ ఘటన బాధాకరమన్నారు. చంద్రబాబుతో పాటు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, ఓఎన్జీసీ, గెయిల్ అధికారులు కూడా ఉన్నారు.
ప్రమాదానికి కారకులపై చర్యలు: తోట
గ్యాస్ పైప్లైన్ పేలుడుకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తోట నర్సింహం తెలిపారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ నాణ్యతలేని పైపుల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలి : నారాయణ
నగరం గ్యాస్ ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. ప్రమాదం వెనక రిలయన్స్, ఇతర శక్తుల హస్తం ఉండవచ్చు అని ఆయన ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియాల ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు.