ఆ బాధ్యతపై టీడీపీ నేతలకు బాబు హెచ్చరిక ; 'హోదా రానిది ఆ ఇద్దరి వల్లే'
విజయవాడ : కేఎల్ యూనివర్సిటీలో నిర్వహిస్తోన్న టీడీపీ రెండో రోజు శిక్షణా శిబిరం సందర్బంగా.. ఇసుక అక్రమాల గురించి నేతలను హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఎంతటివారైనా సరే.. ఇసుక అక్రమాలకు పాల్పడినట్టు తెలిస్తే ఉపేక్షించేది లేదంటూ చెప్పారు.
ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టామన్నారు చంద్రబాబు. అయితే ఈ పథకంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయని, ఓ పత్రిక బయటపెట్టిన వివరాల ఆధారంగా తాను నివేదికలు తెప్పించుకుని విషయాన్ని పరిశీలిస్తున్నానని చెప్పారు. కింది స్థాయి నేతలు ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలే బాధ్యత వహించాలని సూచించారు.
ఈ విషయంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు బాధ్యత తీసుకోకపోతే తన స్థాయిలో జోక్యం చేసుకోవాల్సి వస్తుందని చంద్రబాబు నేతలను హెచ్చరించారు.
ఆ ఇద్దరి వల్లే హోదా రాలేదు : ఉమ్మారెడ్డి
గుంటూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చేసింది చంద్రబాబు వెంకయ్యలే అని మండిపడ్డారు వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో గుంటూరులో జరిగిన వైసీపీ నగర కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికి తిరిగి ఓటు వేయాలని అడిగే హక్కు రాష్ట్రంలో వైసీపీకి మాత్రమే ఉందని ఈ సందర్బంగా ఆయన వ్యాఖ్యానించారు.