నాడు సీబీఐని నిషేధించి.. నేడు స్వాగతిస్తోన్న చంద్రబాబు: హైకోర్టు ఆదేశాలపై హర్షాతిరేకాలు
అమరావతి: విశాఖపట్నం రూరల్ జిల్లాలోని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనస్థీషియనిస్ట్గా పని చేస్తోన్న డాక్టర్ సుధాకర్ అరెస్టు ఉదంతం అటు తిరిగి, ఇటు తిరిగి సీబీఐకి వెళ్లింది. ఆయనను అరెస్టు చేసే సమయంలో పోలీసులు ప్రవర్తించిన విధానం పట్ల తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసలను వ్యక్తం చేస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ పోరాడుతోంది. ఇదే విషయంపై తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన ఓ లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. సంచలన ఆదేశాలను జారీ చేసింది.
జగన్ ప్రభుత్వానికి భారీ జలక్... సీబీఐకి సుధాకర్ వ్యవహారం.. హైకోర్టు ఆదేశాలతో ఉక్కిరి బిక్కిరి
తెలుగుదేశం నేతల్లో హర్షాతిరేకాలు..
ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా సమగ్ర నివేదిక అందజేయాలని నిర్దేశించింది. సీబీఐ విచారణకు హైకోర్టు ఏకంగా కాల పరిమితిని కూడా నిర్దేశించడం నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అరెస్టు ఉదంతం పట్ల హైకోర్టు ఏ స్థాయిలో ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. హైకోర్టు తీసుకున్న తాజా నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్, వంగలపూడి అనిత సహా పలువురు నాయకులు హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
కుట్ర కోణం బయటపడుతుంది..
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అరెస్టు ఉదంతాన్ని సీబీఐకి అప్పగించడం మంచి నిర్ణయమని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. హైకోర్టు ఈ నిర్ణయాన్ని తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారు. డాక్టర్ సుధాకర్ అరెస్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కుట్ర పన్నిందనే విషయం ఈ విచారణ సందర్భంగా బహిర్గతమౌతుందని అన్నారు. ప్రభుత్వం కుట్ర పన్నిందని తాము ముందు నుంచీ చెబుతూనే వస్తున్నామని, ఇప్పుడు అదే దిశగా సీబీఐ ద్వారా విచారణ కొనసాగేలా హైకోర్టు నిర్ణయాన్ని తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని చంద్రబాబు అన్నారు.
మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా..
సమాజంలో ఉన్నతంగా జీవిస్తోన్న ఓ డాక్టర్ పట్ల ప్రభుత్వం, పోలీసులు ఎంత అమానవీయంగా ప్రవర్తించారో అందరూ చూశారని చెప్పారు. పోలీసుల హింస వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని ఆరోపించారు. ఆయనను అరెస్టు చేయడం, మద్యం సేవించి ఉన్నాడనే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ఇదంతా కుట్రలో భాగమేనని చంద్రబాబు విమర్శించారు. మాస్కులను అడిగిన ఓ డాక్టర్ పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడాన్ని ఎవరూ సమర్థించబోరని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టడానికి హైకోర్టు సీబీఐని ఆదేశించడాన్ని తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని అన్నారు.
నాడు నిషేధించి..
ఇదివరకు చంద్రబాబు తన ప్రభుత్వ హాయంలో సీబీఐని నిషేధించిన విషయం తెలిసిందే. తన అనుమతి లేనిదే సీబీఐ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదంటూ అప్పట్లో జీవోను జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపై కక్షసాధించడానికి కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో సీబీఐని ప్రయోగిస్తున్నారని, ఐటీ దాడులను చేయిస్తున్నారంటూ ఆరోపించారు. సీబీఐని నిషేధిస్తూ ఆదేశాలను జారీ చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీవోను రద్దు చేశారు. సీబీఐకి స్వేచ్ఛను కల్పించారు. ఇప్పుడు అదే చంద్రబాబు సీబీఐ విచారణ పట్ల హర్షం వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరిచుకుంది.
Recommended Video
ప్రభుత్వానికి చెంపదెబ్బ
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపదెబ్బ వంటిదని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని చెప్పారు. తీర్పు వెలువడిన వెంటనే ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం వెనుక సీబీఐ విచారణకు ప్రభుత్వం నిరాకరించగా.. హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పుడు నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ అరెస్టు ఉదంతాన్ని సీబీఐకి అప్పగించడం.. ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనమని చెప్పారు.