ఏపీకి చంద్రబాబే పెద్ద బ్రాండ్ అంబాసిడర్, జగన్ రూటే వేరు: కాల్వ
అమరావతి: ఏపీకి సీఎం చంద్రబాబు నాయుడే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం రాజధాని కమిటీలతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తానని చెప్పడం సంతోషదాయకమన్నారు. దీని వల్ల ఇరు రాష్ట్రాల మధ్య సామరస్య పూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు.
అక్టోబర్ 22న జరిగే రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడీ రావడం ఏపీ అభివృద్ధి దిశనే మార్చేస్తుందన్నారు. కాగా, ఏపీ అభివృద్ధికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తన వంతు సహకారం అందిస్తున్నారన్నారు.
అందరిది ఒక దారి అయితే ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ది మరో దారి అన్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించినా రానని చెప్పిన వైయస్ జగన్ తన రాజకీయ ఎదుగుదల కోసం రాష్ట్రం ఎప్పుడూ సమస్యల్లోనే ఉండాలని కోరుకుంటున్నట్లుగా ఉందన్నారు.
రాజధాని కమిటీలతో ముగిసిన చంద్రబాబు సమావేశం
‘అమరావతి' నిర్మాణానికి ఏర్పాటుచేసిన కమిటీలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం సమావేశమయ్యారు. ఈసందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటే అన్న భావన మనంకల్పించాలని అన్నారు. ఆ ఉద్దేశంతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ను ఆహ్వానించానన్నారు.
శంకుస్థాపనకు సంబంధించి ప్రభుత్వం 8 కమిటీలను వేసింది. ఈ కమిటీల్లో ముఖ్యమైన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కీలకమైన ఉన్నతాధికారులతో బాబు క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు.
రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కమిటీ సభ్యులైన ఆయా శాఖల మంత్రులు, అధికారులకు సూచించారు.