పోలవరంపై రంగంలోకి బాబు, సీఎంలను కలుస్తారు
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు పైన పక్క రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారితో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన వచ్చే వారంలో ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలలో పర్యటించనున్నారు.
పోలవరం అభ్యంతరాల పైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. వారి నుండి చంద్రబాబు సూచనలు తీసుకునే అవకాశముంది. పోలవరం ప్రాజెక్టు పైన ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు, ఛత్తీస్ గఢ్ రాజధాని నయా రాయ్పూర్ ను చంద్రబాబు సందర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సలహాలు తీసుకోనున్నారు.
హిందూపురంలో కామినేని, బాలకృష్ణ
అనంతపురం జిల్లా హిందూపురంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస రావు, స్థానిక శాసన సభ్యుడు, నటుడు బాలకృష్ణ పర్యటించారు.
ఈ సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన జనతా సంజీవిని మందుల దుకాణాన్ని మంత్రి, ఎమ్మెల్యే ప్రారంభించారు. జనతా సంజీవినిలో పేదలకు తక్కువ ధరలకే మందులు లభిస్తాయని మంత్రి కామినేని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.