వైయస్ జగన్తో పోటీ: సీమాంధ్రకే చంద్రబాబు పరిమితం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రకే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఆయన పోటీ చేస్తారనే ఊహాగానాలకు తెరపడినట్లే. సీమాంధ్ర (రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్) ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఆయన పోటీ పడనున్నారు.
సీమాంధ్రలో నిర్వహిస్తున్న ప్రజాగర్జన బహిరంగ సభల్లో చంద్రబాబు చేస్తున్న ప్రకటనను బట్టి తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశాలు లేవని అర్థమవుతోంది. సామాజిక తెలంగాణను సాధిస్తానని, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి పదవిని బిసికి ఇస్తానని ఆయన ప్రకటనలు చేస్తున్నారు. దానికితోడు, సీమాంధ్రను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతానని ఆయన ప్రజాగర్జన బహిరంగ సభల్లో హామీలు ఇస్తున్నారు. నెల్లూరులో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో కూడా అదే మాట అన్నారు.

కాంగ్రెసు నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరిగిన నేపథ్యంలో సీమాంధ్రలో తాను అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. అయితే, తాజా సర్వేలో వైయ్ససార్ కాంగ్రెసు పార్టీ ఊహించినంతగా బలహీనపడలేదని అర్థమవుతోంది. దాంతో జగన్తో చంద్రబాబు తీవ్రంగా పోటీ పడాల్సే వస్తుంది.
దానికితోడు, కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య పరిరక్షణ సమితి పార్టీ వస్తుందని కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీని బలహీనపరుస్తారనే విషయంపై కూడా చంద్రబాబు సీమాంధ్రలో అధికారం చేపడుతారా, లేదా అనేది ఆధారపడి ఉంటుంది. కాంగ్రెసు పార్టీ పూర్తిగా బలహీన పడిందనే అంచనాలు సాగుతున్నాయి. అయితే, సీమాంధ్రలో ఓ వర్గాన్ని సమీకరించి తెలుగుదేశం పార్టీకి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు అర్థమవుతోంది. సీమాంధ్రలో ప్రజలు నాలుగు వైపులా చీలిపోతే పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పడం కష్టమే.












Click it and Unblock the Notifications