ఏపీలో రేషన్ అక్రమాలకు చెక్: సివిల్ సప్లయిస్ వాహనాలకు జియో ట్యాగింగ్!!
ఏపీలో రేషన్ అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు . సివిల్ సప్లయిస్ వాహనాలకు జియో ట్యాగింగ్ చేసి మానిటర్ చేస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరసరఫరాల పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ప్రతిపక్షాలు పౌర సరఫరా వ్యవస్థ పై విమర్శలు చెయ్యటానికి తావు లేకుండా, అలాగే ఏపీలో పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేసేలా చర్యలు చేపట్టింది . అందులో భాగంగా రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ ను నేడు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు.

పౌర సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేలా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు
పౌర సరఫరాల వ్యవస్థలో ఇప్పటికే రైతులకు మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. దళారులు, మిల్లర్లతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ధాన్యం సేకరించి నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ అక్రమాలకు చెక్ పెట్టడానికి కూడా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం.

అన్ని సివిల్ సప్లై వాహనాలకు జియో ట్యాగింగ్
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విజయవాడలో బుధవారం సివిల్ సప్లై కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పౌర సరఫరా ఏ విధంగా జరుగుతుందో పర్యవేక్షించడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం దారి మళ్ళిన క్షణాల్లో సమాచారం అందుతుందని, అన్ని సివిల్ సప్లై వాహనాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేశామని, తద్వారా వాహనాన్ని ట్రాక్ చేస్తున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు.

ఆన్లైన్ నిఘా వ్యవస్థ ద్వారా అక్రమాలకు చెక్
రేషన్ సరుకులు రవాణా పంపిణీలో అక్రమాలకు పటిష్టమైన ఆన్లైన్ నిఘా వ్యవస్థ ద్వారా చెక్ పెట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పైన విరుచుకుపడిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సివిల్ సప్లై శాఖలో అప్పులు పెరగడానికి చంద్రబాబునే కారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి నారా లోకేష్ అంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన లోకేష్ పాదయాత్ర పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

విజయవాడ కేంద్రంగా రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతినెల పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం రైస్ మిల్లుల నుంచి ఎఫ్సీఐ గోడౌన్ కు, పౌరసరఫరాల గోడౌన్ లకు, అక్కడనుండి మండల స్థాయి స్టాక్ పాయింట్లకు, ఇక్కడి నుంచి రేషన్ షాపులకు రవాణా అవుతుంది. అయితే ఈ సరఫరా గొలుసులో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోకుండా విజయవాడ కేంద్రంగా రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు వాహనాల కదలికలను మానిటర్ చేస్తూ ఉంటారు.












Click it and Unblock the Notifications