తొలి అడుగు: సచివాలయానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు
గుంటూరు: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెలగపూడిలో నిర్మించదలచిన తాత్కాలిక సచివాలయానికి నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయడు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. వెలగపూడిలో ఎంపిక చేసిన స్థలంలో ముందుగానే నిర్ణయించిన సుముహూర్తం ప్రకారం సరిగ్గా 8.23 గంటలకు చంద్రబాబు పునాది రాయి వేశారు.
దానిపై సిమెంట్ వేసి శంకుస్థాపనను పూర్తి చేశారు. వేదమంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం ముగిసింది. అంతకు ముందు నల్లూరు పండితులు శంకుస్థాపన ప్రాంతంలో ధాతుస్థాపన, రత్నాన్యాసం, ఇష్టికాన్యాసం పూజలు నిర్వహించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో ఇదో గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది.

తుళ్లూరు మండలంలోని వెలగపూడి గ్రామ పరిధిలో 45.129 ఎకరాల్లో తాత్కాలిక సచివాలయ భవనం నిర్మించనున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోజీ కంపెనీలు నిర్మించనున్నాయి.
కేవలం రెండు రోజుల ముందుగా ముహూర్తం ఖరారు కావడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని హడావుడి లేకుండా నిర్వహించారు.
వెలగపూడి వద్ద స్థలాన్ని ఎంపిక చేసిన స్థలంలో తాత్కాలిక సచివాలయం కోసం ప్రస్తుతం జీ+1లో మూడు భవనాలను నిర్మించనున్నారు. భవిష్యత్తులో జీ+7గా నిర్మించి, వాణిజ్య సముదాయంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.
ప్రస్తుతం ఒక్కో భవనంలో ఒక్కో ఫ్లోర్లో లక్ష చదరపు అడుగుల స్థలం అందుబాటులో రానుంది. పూర్తిస్థాయి రాజధాని నిర్మాణం అనంతరం ఈ భవనం పూర్తిగా ఖాళీ చేయనున్నారు. అప్పుడు వీటిని వాణిజ్య పరమైన అవసరాలకు వినియోగిస్తామన్నారు.
ఈ తాత్కాలిక రాజధాని కోసం రూ. 200 కోట్లు ఖర్చుపెడుతున్నారు. అయితే దీనిపై పెడుతున్న ఖర్చు వృథా అనే వాదనలో అర్థం లేదని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు.
శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్రమంత్రులు చిన రాజప్ప, యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, పరిటాల సునీత, పీతల సుజాత, ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications